హనుమకొండ చౌరస్తా, జూలై 20 : వరంగల్ నగరంలో యథేచ్ఛగా ఫుట్పాత్లు ఆక్రమించడంతో పాదచారులకు దారిలేకుండా పోయింది. దుకాణాలు, వాహనాల పార్కింగ్, తోపుడు బండ్లు కాలిబాటలపైనే ఏర్పాటు చేయడంతో ప్రజలు నడిరోడ్డుపై నడవాల్సిన పరిస్థితి ఉండ డంతో ప్రమాద బారిన పడుతున్నారు. నగరంలో ఫుట్పాత్లు ఎక్కడికక్కడ ఆక్రమణకు గురయ్యాయి. ప్రధాన రహదారుల్లో దుకాణాలు, వాహనాల పార్కింగ్ పుట్పాత్లపైనే ఉంటున్నాయి. ఫలితంగా పాదచారులు నడిచే వీలు లేకుండాపోతోంది.
హనుమకొండ చౌరస్తా నుంచి మొదలుకొని పోలీస్ కమిషనర్ కార్యాలయం, అక్కడి నుంచి నయీంనగర్, కేయూ క్రాస్ వరకు ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచి హనుమకొండ బస్స్టేషన్ వరకు నడవడానికి వీలులేకుండా ఫుట్పాత్లపై డబ్బాలు ఏర్పాటు చేసి వ్యాపారాలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అసలు ఫుట్పాత్లు వెతికినా కనిపించని పరిస్థితి నెలకొంది. మర్కజీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద ఉదయం, సాయంత్రం రోడ్డును ఆక్రమించి పండ్ల వ్యాపారాలు నిర్వహిస్తుండడంతో ఇక్కడ ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయని పాదచారులు వాపోతున్నారు. ములుగు రోడ్ నుంచి వరంగల్ రైల్వే స్టేషన్ వరకు అన్ని రూట్లలో ఇదే పరిస్థితి నెలకొంది.
కానరాని ఫుట్పాత్లతో పాదచారులు రోడ్డు మధ్యలో నడవాల్సి రావడంతో ఎటు నుంచి ఏ వాహనం వచ్చి ఢీ కొడుతుందోనని భయాందోళన కు గురవుతున్నారు. ఏటా వందలాది మంది గాయాలపాలవుతున్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్యకు ఇదే ప్రధాన కారణం. ఇరుకుదారుల్లో పాదచారులు నడవడం మరింత సమస్యగా మారింది. చిరువ్యాపారులతో పా టు షాపింగ్ మాల్స్, మెడికల్ షాపులు, రెస్టారెంట్ల నిర్వాహకులు ఫుట్పాత్లను ఆక్రమించారు. దానికి ఆనుకునే వాహనాల పార్కింగ్ చేస్తున్నారు. దుకాణాల బోర్డులు, మెట్లు, వస్తువులను ఫుట్పాత్లపైనే పెడుతున్నారు. దానిపైనే వ్యాపారులు తాత్కాలిక షెడ్లు లేదా శాశ్వత నిర్మాణాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో నడవడానికి అవకాశం లేకక నడిరోడ్డుపై నుంచే నడవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.
నయీంనగర్ కిషన్పురలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులను ద్విచక్ర వాహనదారుడు ఢీకొనడంతో గాయాలపాలయ్యారు. బీఈడీ కాలేజీ వద్ద రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. హనుమకొండ పోలీస్స్టేషన్ సమీపంలో ఒకరిని ద్విచక్ర వాహనం ఢీకొనగా కిందపడి గాయాలపాలయ్యాడు. ప్రభుత్వ మర్కజీ స్కూల్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులను కారు ఢీకొంది. హనుమకొండ చౌరస్తాలో షాపింగ్కు వచ్చిన వారిని ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టడంతో ఆస్పత్రి పాలయ్యారు.