వారంత యువతీయువకులు.. అందరూ పేద కుటుంబాలకు చెందినవారు.. ఏదైనా ఉద్యోగం చేసి తమ తల్లిదండ్రులకు అండగా నిలవాల్న తపనతో హైదరాబాద్ బాటపట్టారు. డిగ్రీ, బీటెక్ పూర్తిచేసి సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్స్లో ఉన్న ఓ చైన్సిస్టమ్ కంపెనీలో పనిచేస్తూ గురువారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో పొగకు ఊపిరాడక ప్రాణాలు వదిలారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం చంద్రయ్యపల్లెకు చెందిన ఉప్పల శివ(22), దుగ్గొండి మండలం మర్రిపెల్లికి చెందిన వంగ వెన్నెల(22), ఖానాపురం మండల కేంద్రానికి చెందిన బానోత్ శ్రావణి(22), మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఎర్రకుంట శివారు సురేశ్నగర్ తండాకు చెందిన జాటోత్ ప్రమీల (22), కేసముద్రం మండలం ఇంటికన్నెకు చెందిన ప్రశాంత్(23) మృత్యువాత పడ్డారు. చేదికందిన తమ పిల్లలు చనిపోవడంతో వారి తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్నారు. మృతులకు వారి స్వగ్రామాల్లో శుక్రవారం సాయంత్రం అంత్యక్రియలు జరుగగా స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు.
నర్సంపేట/ఖానాపురం/దుగ్గొండి/కేసముద్రం/గూడూరు, మార్చి 17: సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్స్లో గురువారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఐదుగురు యువతీ యువకులు దుర్మరణం చెందారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం చంద్రయ్యపల్లెకు చెందిన ఉప్పుల శివ(22), దుగ్గొండి మండలం మర్రిపెల్లికి చెందిన వంగ వెన్నెల(22), ఖానాపురం మండల కేంద్రానికి చెందిన బానోత్ శ్రావణి(22), మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఎర్రకుంట శివారు సురేశ్నగర్ తండాకు చెందిన జాటోత్ ప్రమీల(22), కేసముద్రం మండలం ఇంటికన్నెకు చెందిన ప్రశాంత్(23) మృత్యువాత పడ్డారు. శివ, వెన్నెల, ప్రశాంత్ డిగ్రీ, శ్రావణి, ప్రమీల బీటెక్ చేశారు. పేదకుటుంబాలకు చెందిన వీరు ఉద్యోగం చేసి తమ కుటుంబాలకు ఆసరాగా ఉండాలన్న తపనతో హైదరాబాద్ వెళ్లి అక్కడ ఓ ప్రైవేట్ చైన్ సిస్టమ్ కంపెనీలో చేరారు. వీరి ఆఫీస్ స్వప్నలోక్ కాంప్లెక్స్లో ఉండగా వీరంతా అగ్నిప్రమాదంలో పొగకు ఊపిరాడక ప్రాణాలు వదిలారు. వీరి మృతదేహాలు శుక్రవారం స్వగ్రామాలకు రాగా సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో విషాదం అలుముకుంది. ఎదిగిన బిడ్డలు ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
చేతికందిన కొడుకు..
నర్సంపేట మండలం చంద్రయ్యపల్లెకు చెందిన ఉప్పుల రాజు, రజిత దంపతులకు కొడుకు శివ. తండ్రి రాజు తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు. డిగ్రీ చదివిన అతడు డబ్బులు కట్టి సికింద్రాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం (ఈ కామర్స్) చేస్తున్నాడు. తన ఆఫీస్ స్వప్నలోక్ కాంప్లెక్స్లోనే ఉంది. స్నేహితులతో కలిసి అక్కడే ఉంటున్న శివ, గురువారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఊపిరాడక ప్రాణాలు వదిలాడు.
చేదోడువాదోడుగా ఉండేది..
దుగ్గొండి మండలం మర్రిపెల్లికి చెందిన వంగ లక్ష్మి, రవి దంపతులకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె వెన్నెల (22) డిగ్రీ చదివి, ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లింది. అక్కడే స్వప్నలోక్లోని ఉన్న ప్రైవేట్ కంపెనీలో డబ్బుకట్టి ఉద్యోగం (ఈ కామర్స్) చేసేది. తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేది. అగ్నిప్రమాదంలో ఆమె చనిపోవడంతో తల్లిదండ్రుల రోదనకు అంతులేకుండా పోయింది.
నిరుపేద కుటుంబం నుంచి బీటెక్ చేసి..
ఖానాపురం మండల కేంద్రానికి చెందిన బానోత్ నర్సింహ, పద్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. వారిది నిరుపేద కుటుంబం. పెద్దకూతురు శ్రావణి(22) మొదటి నుంచీ చదువులో చురుగ్గా ఉండేది. ఐదోతరగతి వరకు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో, పదో తరగతి వరకు అశోక్నగర్ కేజీబీవీలో టెన్త్లో మంచి మార్కులు సాధించి, ప్రభుత్వ స్కాలర్షిప్తో నర్సంపేటలో ఇంటర్ పూర్తిచేసింది. ఎంసెట్లో మంచి ర్యాంకు రావడంతో కోదాడలోని గేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ను హాస్టల్లో ఉంటూ పూర్తిచేసింది. ఆమెకు బీటెక్ సీటు రాగానే ఉపాధి కోసం కుటుంబసభ్యులు హైదరాబాద్ వెళ్లారు. తల్లిదండ్రులు భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తుండగా ఏడాది క్రితం బీటెక్ పూర్తిచేసిన శ్రావణి, ఆరు నెలల క్రితం రూ.3లక్షలు అప్పుచేసి మరీ కట్టి చైన్సిస్టమ్ (ఈ కామర్స్)లో చేరింది. మరో ఇద్దరిని చేర్పిస్తే కట్టిన రూ.3లక్షలు తిరిగి ఇచ్చేలా ఒప్పందం ఉందని తెలిసింది. వస్తున్న అరకొర జీతంతో తల్లిదండ్రులకు భారం కావద్దని హాస్టల్లో ఉంటూ స్వప్నలోక్ కాంప్లెక్స్లోని తన కార్యాలయానికి వెళ్లి వచ్చేది. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు రావడంతో పలు ఉద్యోగాలకు దరఖాస్తు కూడా చేసింది. ఇంతలోనే అగ్నిప్రమాదంలో ఆమె తుదిశ్వాస విడిచింది.
జవాన్ కావాలనుకొని..
కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామానికి చెందిన అమ్మరాజ్ జనార్దన్-ఉపేంద్ర దంపతులకు కొడుకు, కుమార్తె. వ్యవసాయ కుటుంబం. తల్లిదండ్రులు కూలికి కూడా వెళ్లి పిల్లలను పోషిస్తున్నారు. కొడుకు ప్రశాంత్ (23) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి, నర్సంపేటలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్, హనుమకొండలోని కేడీసీలో డిగ్రీ పూర్తిచేశాడు. ఆర్మీ లేదా పోలీస్ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో ఆ ప్రయత్నాల్లో ఉండేవాడు. తొలిసారి ఆర్మీ సెలక్షన్స్లో దేహదారుఢ్య పరీక్షల్లో క్వాలిఫై కాలేదు. రెండు, మూడుసార్లు రాత పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేదు. ఈ అనుభవంతో గ్రామంలో యువకులకు ఈవెంట్స్పై శిక్షణ ఇచ్చాడు. ఎలాగైనా కొలువు కొట్టాలని హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటూనే ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇందులో ఉద్యోగం కోసం రూ.2.80లక్షల దాకా కంపెనీకి ముట్టజెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ క్రమంలో అగ్ని ప్రమాదంలో ప్రశాంత్ చనిపోవడంతో కుటుంబంతోపాటు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
బీటెక్ చేసి.. ప్రైవేట్ కంపెనీలో చేరి..
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఎర్రకుంట శివారు సురేశ్నగర్ తండాకు చెందిన జాటోత్ భద్రు, బుజ్జి దంపుతల ఏకైక కుమార్తె ప్రమీల(22) బీటెక్ పూర్తిచేసి 14నెలల క్రితం స్వప్నలోక్ కాంప్లెక్స్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో దాదాపు రూ.లక్షా50వేలకు పైగా కట్టి చేరింది. ప్రమాద సమయంలో బయటకు రాలేక పొగ కమ్మి ఊపిరాడక ప్రాణాలు వదిలింది.
ఒకే కంపెనీలో చేరి.. ప్రాణాలు పోగొట్టుకొని..
స్వప్నలోక్ కాంప్లెక్స్ ప్రమాద ఘటనలో మృతులంతా ఒకే కంపెనీకి చెందినవారు కావడం గమనార్హం. వీరంతా ఒక్కొక్కరు సుమారు రూ.లక్షా 50వేల నుంచి రూ.3లక్షలదాకా సదరు చైన్ సిస్టమ్ కంపెనీకి ఎదురుకట్టి చేరారు. వీరు మరికొందరిని చేర్పిస్తే కట్టిన డబ్బు తిరిగి ఇస్తారన్న ఒప్పందం కుదుర్చుకున్నట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. అప్పుచేసి కంపెనీకి కట్టడంతో ఆర్థికంగా మరింత నష్టపోయామని, ఇప్పుడు పిల్లలనే పోగొట్టుకున్నామని రోదిస్తున్నారు.
మృతులకు ఆత్మ శాంతి కలగాలి
మంత్రి సత్యవతి, మానుకోట ఎమ్మెల్యే శంకర్నాయక్
మహబూబాబాద్: స్వప్నలోక్ అగ్నిప్రమాదం దురదృష్టకరమని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి, మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఉమ్మడి జిల్లాకు చెందిన వారు ఐదుగురు ఉండడం బాధాకరమని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కాంక్షించారు. కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే ‘పెద్ది’ఆర్థికసాయం
నర్సంపేట: స్వప్నలోక్ ప్రమాద మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి శుక్రవారం ఆర్థికసాయం అందజేశారు. దుగ్గొండి మండలం మర్రిపెల్లికి చెందిన వంగ వెన్నెల, ఖానాపురం మండలం బానోత్ శ్రావణి, నర్సంపేట మండలం చంద్రయ్యపల్లికి చెందిన ఉప్పుల శివ మృతిచెందగా కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఒక్కో కుటుంబానికి రూ.50వేల చొప్పున ఆర్థికసాయం అందించారు.