ఐదు రోజులుగా ఎడతెరిపిలేని వాన
చెరువులు, వాగుల్లోకి వరదలు
మత్తడిపడుతున్న దేవరుప్పుల చెక్డ్యామ్లు
వ్యవసాయ పనులకు ఆటంకం
జనగామ జిల్లాలో జల్లులే తప్ప జడివాన కురవడం లేదు. ఇలా నాలుగు రోజులుగా ముసురు పట్టి వదలకపోవడంతో జనజీవనం ముందుకుసాగడం లేదు. ఎడతెరిపి లేకుండా పడుతున్న మోస్తరు వర్షాలతో జలవనరుల్లోకి వరద వచ్చి చేరుతుండగా చెక్డ్యాములు, చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. అదే సమయంలో పంట పొలాల్లోకి నీరు చేరడంతో వానకాలం సాగు పనులు ఆగిపోయాయి. వరుస వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతుండగా, పలుచోట్ల పాత ఇండ్లు కూలిపోయాయి. దీంతో అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలకు ఉపక్రమించి ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు.
జనగామ, జూలై 12 (నమస్తే తెలంగాణ) : గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సీజన్ ఆరంభంలోనే వర్షాలు దంచికొడుతున్నాయి. నాలుగురోజులుగా తెరిపిలేకుండా కురుస్తుండడంతో జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల పాత ఇండ్లు కూలిపోవడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణం స్పందించి బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. రఘునాథపల్లి మండలం మల్లంపల్లిలో వర్షానికి కూలిన ఇండ్లను ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పరిశీలించి బాధితులను పరామర్శించగా, నర్మెట మండలం హన్మంతాపూర్లో వర్షానికి కూలిపోయిన ఇంటిని జడ్పీ సీఈవో విజయలక్ష్మి పరిశీలించారు. వరుసగా కురుస్తున్న వానలతో నర్మెట-గండిరామారం గ్రామాల మధ్య గుట్టపై నుంచి పెద్ద బండరాయి దొర్లి రోడ్డుపై పడింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎడతెరిపిలేని వానలతో నీటి వనరులకు జలకళ వచ్చింది. చెరువులు, కుంటలు, వాగులపై చెక్డ్యామ్లు, దేవాదుల రిజర్వాయర్లలోకి నీరు చేరుతున్నది. జిల్లా వ్యాప్తంగా మంగళవారం సగటున 15.9 మి.మీ వర్షం పాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా జఫర్గఢ్లో 22.6 మి.మీ, కొడకండ్లలో 15.2, దేవరుప్పులలో 13.4, స్టేషన్ఘన్పూర్లో 14.8, జనగామలో 13.4, లింగాలఘనపురంలో 20.6, బచ్చన్నపేటలో 12.6, రఘునాథపల్లిలో 19.7, పాలకుర్తిలో 17.6, అత్యల్పంంగా నర్మెట మండలంలో 9.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో ఈ నెలలో 158.9 మి.మీ వర్షపాతం నమోదైంది.
పొంగిపొర్లుతున్న చెక్డ్యామ్లు
దేవరుప్పుల : కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులకు వరదలొస్తున్నాయి. దీంతో మండలంలోని చెక్డ్యామ్లు మత్తడిపడుతున్నాయి. దేవరుప్పుల చెక్డ్యామ్ మంగళవారం ఉదయం నుంచి పొంగిపొర్లుతున్నది. యశ్వంతాపూర్ వాగుపై ఉన్న తొమ్మిది చెక్డ్యాములు నిండి అలుగుపోస్తున్నాయి. ఎడతెరిపిలేని వానలతో కోలుకొండ వాగుపై నిర్మించిన చెక్డ్యామ్ ఆదివారం రాత్రి నుంచి మత్తడి పడుతున్నది. ఈ వానకాలం సీజనల్లో చెక్డ్యామ్లు నిండడంతో వాగు జీవనదిని తలపిస్తున్నది. వరదలొస్తుండడంతో వాగు పరివాహక ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండు పంటలకు సాగునీటి సమస్య ఉండదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయ పనులకు ఆటంకం
జనగామ రూరల్ : ఐదు రోజులుగా కురుస్తున్న ముసురుతో గ్రామాల్లో వ్యవసాయ పనులకు ఆటంకం ఏర్పడింది. రైతులు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లేందుకు ఇబ్బందులుపడుతున్నారు. పత్తి చేన్లలో కలుపు తీయాలంటే ఎడతెరిపిలేని వానలతో పనులు చేసేందుకు కూలీలు ముందుకు రావడంలేదు. వాతావరణం అనుకూలించకపోవడంతో వ్యవసాయ పనులు నిలిచిపోయాయి. పొలాల్లో, పత్తి చేన్లలో వర్షపు నీరు నిల్వడంతో తెగుళ్లు సోకుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.