వెంకటాపురం (నూగూరు) జూలై 22 : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించి కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో అటవీ ప్రాంత గ్రామాల్లో అంటువ్యాధులు, విష జ్వరాలు ప్రబలకుండా వైద్య ఆరోగ్యశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. దీంతో వైద్యులు, సిబ్బంది వాగులు, వంకలు దాటి వెళ్లి ప్రజలకు వైద్య సేవలు అందించడంతోపాటు సర్వేలు చేస్తున్నారు.
ములుగు జిల్లా వెంకటాపురం (నూగూరు) మండలంలోని పెంకవాగు, కొత్తగుంపు, కానిపాకం, తిప్పాపురం గ్రామాల్లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం ఫీవర్ సర్వే చేపట్టారు. వైద్య సిబ్బంది వాగులు దాటి ఆయా గ్రామాలకు వెళ్లి ఇంటింటా ఫీవర్ సర్వే చేశారు. సుమారు 645 మందిని కలిసి వైద్య పరీక్షలు చేసి, ఉచితంగా మందులు అందజేశారు. కొందరి నుంచి రక్తనమూనాలు సేకరించారు. కార్యక్రమంలో ఎదిర డాక్టర్ భవ్యశ్రీ, వైద్యసిబ్బంది రాఘవులు, తదితరులు పాల్గొన్నారు.