రేగొండ/శాయంపేట, ఆగస్టు 11 : సాగు నీటి కోసం రైతులు రోడ్డెక్కారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రూపిరెడ్డిపల్లె గ్రామంలోని పరకాల-భూపాలపల్లి రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్నదాతలు మంగళవారం ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆందోళనలో పాల్గొని మద్దతు తెలిపారు. మొదటగా హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి శివారులోని చలివాగు ప్రాజెక్టు, దేవాదుల పంప్హౌస్ను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా పోలీసులు అడ్డుకుని మాజీ ఎమ్మెల్యేతో పాటు కొందరినే లోపలికి అనుమతిచ్చారు. పంప్హౌస్లో నడుస్తున్న మోటర్లను, ఎత్తిపోస్తున్న నీటి నిల్వలను ఆయన పరిశీలించారు. దేవాదుల ఈఈతో ఫోన్లో మాట్లాడి ఇక్కడి రైతులకు ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కపట ప్రేమను ప్రదర్శిస్తుందని, వారు కన్నెర్ర చేస్తే ప్రభుత్వ పతనం తప్పదని అన్నారు.
వరి నార్లు పోసి 45 రోజలు కావస్తున్నప్పటికీ చలివాగు ప్రాజెక్టు ద్వారా సాగునీరు విడుదల చేయలేదన్నారు. ఈ ప్రాజెక్టు కింద అధికారికంగా 5వేలు, అనధికారికంగా మరో రెండువేల ఎకరాల సాగు విస్తీర్ణం కలిగి ఉందన్నారు ఈ ప్రాంతానికి సాగునీరు విడుదల చేయకుండా స్టేషన్ఘన్పూర్, ధర్మసాగర్ ప్రాంతాలకు విడుదల చేయడం ఎంతవరకు న్యాయమన్నారు. ఇక్కడి ఎమ్మెల్యే ఒక దద్దమ్మలా చూస్తున్నారే తప్ప ఏం చేయలేకపోతున్నాడని విమర్శించారు. చలివాగు ప్రాజెక్టు ద్వారా తామే సాగు నీరు విడుదల చేస్తామని, కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు.
దేవాదుల ద్వారా 9 పంపుల ద్వారా సాగు నీరు పంపింగ్ చేయాల్సి ఉండగా రిపేర్లు, విద్యుత్ కోతల పేరుతో కేవలం 5 పంపులతోనే పంపింగ్ చేస్తున్నారన్నారు. కడియం శ్రీహరికి భయపడి ఈ ప్రాంతానికి కాకుండా స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గానికి సాగునీరు విడుదల చేస్తుంటే ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బుధవారంలోగా చలివాగు ఆయకట్టుకు నీళ్లు విడుదల చేయాలని, లేకుంటే గురువారం తామే రైతులతో కలిసి తూము తెరిచి రైతులకు నీళ్లిస్తామని గండ్ర వెంకటరమణారెడ్డి డెడ్లైన్ విధించారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ వంగాల నారాయణరెడ్డి, బీఆర్ఎస్ రేగొండ మండల అధ్యక్షుడు అంకం రాజేందర్, నాయకులు మామిడి అశోక్, దైనంపెల్లి సుమన్, వైనాల రాజేందర్, లక్ష్మారెడ్డి, మేకల శ్రీనివాస్, ఇమ్మడిశెట్టి సదానందం, చెన్నబోయిన అజయ్కుమార్, చెన్నబోయిన విద్యాసాగర్, గంటా శ్యాంసుందర్రెడ్డి, దాసి శ్రావణ్కుమార్, మేకల వెంకటేశ్వర్లు, అమ్మ అశోక్, ఎంఏ హమీద్, ఇంగే మహేందర్, సామాల పాపిరెడ్డి, తిరుపతిరెడ్డి, కానుగంటి శ్రీనివాస్, పిట్ట భిక్షపతి, సుధాకర్, శ్రీనివాస్, అశోక్, బండి భద్రయ్య, జుపాక నీలాంబరం పాల్గొన్నారు.