వర్ధన్నపేట, జనవరి 10: చలి ఎక్కువగా ఉన్నందున రైతులు వరి పంటలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏవో రాంనర్సయ్య సూచించారు. మంగళవారం ఆయన దమ్మన్నపేటలో వరి పంటను పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. వరిలో కాండం తొలిచే పురుగు నివారణకు 8 నుంచి 10 కిలోల కార్బోఫ్యూరిడాన్ 3జీ గుళికలు ఇసుకలో కలిసి చల్లుకోవాలని సూచించారు. నీటి మట్టాన్ని పూర్తిగా తగ్గించుకుంటూ ఒకట్రొండు రోజులు పొలాన్ని ఆరబెట్టుకోవాలని కోరారు.
ఎకరాకు 25 నుంచి 30 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్ను కలిపి పంటపై చల్లుకోవాలని సూచించారు. కాంప్లెక్స్ ఎరువులు వాడొద్దన్నారు. 2 గ్రాముల చిలీటెడ్ జింకు, 19:19:19 కేజీ, ఫార్ముల-4 ట్యాంకుకు 200 గ్రాముల చొప్పున యూరియాను కలిపి పంటపై వారంలో రెండుసార్లు పిచికారీ చేస్తే పంట చలిని తట్టుకుంటుందని ఏవో వివరించారు. ఆయన వెంట ఏఈవో కావ్య ఉన్నారు.