పాలకుర్తి, ఆగస్టు 3 : కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం వద్ద శనివారం యూరియా కోసం రైతులు బారులు తీరారు. మండలంలోని పలు గ్రామాల నుంచి సుమారు 450 నుంచి 500ల మంది రైతులు ఉదయమే సహకార సంఘం వద్దకు వచ్చి లైన్లో నిలబడి యూరియా కోసం పడిగాపులుగాచారు. గంటల తరబడి లైన్లో నిరీక్షించారు. అయినా రైతులందరికీ యూరియా బస్తాలు దొరకక ఇబ్బందిపడ్డారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తానన్న మార్పు ఇదేనా అంటూ మండిపడ్డారు. రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచని ఈ ప్రభుత్వం ఉన్నా ఒక్కటే.. లేకున్నా ఒకటేనన్నారు. మళ్లీ ఉమ్మడి రాష్ట్రంలోని పాత రోజులు గుర్తుకొస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో చాలామంది రైతులు తప్పని పరిస్థితిలో యూరియా కోసం ప్రైవేట్ దుకాణాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
కాగా, శనివారం సహకార సంఘానికి 444 బస్తాల(ఒక లారీ) యూరియూ దిగుమతి కాగా, దాదాపు 185 మంది వరకు పంపిణీ చేసినట్లు సిబ్బంది తెలిపారు. మిగిలిన రైతులకు యూరియూ అందక నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ విషయంపై సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్ సత్యనారాయణను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరు. అయితే ఇప్పటి వరకు 777 బస్తాల యూరియాను రైతులకు పంపిణీ చేశామని కార్యాలయ సిబ్బంది తెలిపారు. వచ్చిన లారీ లోడ్ యూరియాను వచ్చినట్లే వెంటనే రైతులకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
మళ్లీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్క రోజు రైతులు యూరియూ కోసం ఇబ్బంది పడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తప్పడం లేదు.
– దయ్యాల భిక్షపతి, మల్లంపెల్లి
వానకాలం మొదలైంది. వరి నాట్లు వేశాం.యూరియా కోసం ఎదురు చూస్తున్నాం. పాలకుర్తిలోని రైతు సేవా సహకారం సంఘం వద్దకు వెళితే యూరియా దొరకలేదు. ప్రభుత్వం సరిపడా యూరియా పంపిణీ చేయడం లేదు. తాపకో లారీ వస్తే చొప్పున వస్తే ఇంతమంది రైతులకు ఎలా సరిపోతుంది. ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి. గత కేసీఆర్ ప్రభుతంలో రైతులు ఎలాంటి ఇబ్బంది పడలేదు. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులకు యూరియూ కష్టాలు మొదలైనయి.
– ఉరుమడ్ల నర్సింరెడ్డి, రైతు, మల్లంపల్లి