హనుమకొండ, జూన్ 3 : పీఏసీఎస్ సీఈవో, రైస్ మిల్లర్ మధ్య పంచాయితీతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ధాన్యం అమ్ముకొని పది రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. ఐదు గ్రామాల రైతులకు సంబంధించి సుమారు రూ. 28లక్షల కోసం ఎదురు చూస్తున్నారు. కొనుగోలు కేంద్రం చుట్టూ తిరుగుతున్నా నిర్వాహకులు సరైన సమాధానం ఇవ్వడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులు ధాన్యం అమ్ముకున్న 48 గంటల్లోనే ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్తున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు విరుద్దంగా ఉందనే విమర్శులున్నాయి. అంతేకాక త్వరలో ఓపీఎంఎప్ క్లోజ్ అవకాశం ఉందని, ఆ తర్వాత రైతులు డబ్బులు చెల్లించడం ఇబ్బందికరంగా మారే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అధికారులు తెలిపిన ప్రాథమిక సమాచారం మేరకు జిల్లాలోని కమలాపుర్ పీఏసీఎస్ పరిధిలో యాసంగి ధాన్యం కొనుగోలుకు సంబంధించి 12 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. పీఏసీఎస్ పరిధిలోని ఐదు గ్రామాల సెంటర్లను కమలాపూర్ మండలంలోని రెండు మిల్లులకు ట్యాగింగ్ చేశారు. ఆ ఐదు గ్రామాలకు చెందిన రైతులు పది రోజుల క్రితం ధాన్యం విక్రయించారు. కేంద్రం నిర్వాహకులు ధాన్యాన్ని కేటాయించిన మిల్లులకు పంపించారు. ఇందుకు సంబంధించిన ట్రక్ షీట్లను సైతం మిల్లులకు పంపించగా సదరు మిల్లర్ ఆక్పెప్ట్ చేయలేదని అందుకు చెల్లింపులు ఆగిపోయినట్లు విశ్వనీయ వర్గాల సమాచారం. రైస్ మిల్లుకు పంపిన ధాన్యం బస్తాలు పాతవి అయితే ట్యాబ్లో కొత్తవని కేంద్రం నిర్వాహకులు చేయడంతోనే మిల్లర్ ఆక్సెప్ట్ చేయడం లేదని తెలిసింది.
ఐదు గ్రామాలకు సంబంధించి సుమారు 1,165 క్వింటాళ్లకు సంబంధించిన ట్రక్ షీట్ల వ్యవహారం పెండింగ్లోఉందని, వీటి విలువ సుమారు రూ.28లక్షల వరకు ఉంటుదని సివిల్ సప్లయ్ అధికారులు తెలిపారు. పది రోజులుగా కొనసాగుతున్న పంచాయితీతో రైతులు నష్టపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తనకు పాత గన్నీ సంచులు ఇచ్చి కొత్త సంచులు ఇచ్చినట్లు ట్యాబ్లో ఎంటర్ చేశారని, వాటిని సరిచేస్తే ఆక్సెప్ట్ చేస్తానని మిల్లరు అంటున్నారు. ఇదే విషయంలో డీజీవో బీ మోహన్ను సంప్రదించగా మిల్లర్తో మాట్లాడి రైతులు ఇబ్బందులు కలుగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చూస్తానని చెప్పారు.