పదో తరగతి హిందీ పేపర్ లీకేజీ కేసు విచారణను వరంగల్ పోలీసులు ముమ్మరం చేశారు. నిందితులకు శిక్ష పడేలా పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. సూత్రధారులు, పాత్రధారులకు ఉన్న సంబంధాలు, సోషల్ మీడియాలో పేపర్ ఫొటోను ఫార్వర్డ్ చేసిన వారి సమగ్ర వివరాలను సేకరిస్తున్నారు. పరీక్ష రోజుకు ముందు ప్రధాన నిందితులు నిర్ణయించుకున్న కుట్ర ప్రణాళిక, ఇందులో భాగస్వాములుగా ఉన్న వారిని విచారిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రధాన నిందితుడిగా, ఏ2గా బూరం ప్రశాంత్, ఏ3గా గుండెబోయిన మహేశ్, ఏ5గా మౌటం శివగణేశ్, ఏ6గా పోగు సుభాష్, ఏ9గా పెరుమాండ్ల షర్మిక్, ఏ10గా పోతబోయిన వర్షిత్, ఏ4, ఏ7, ఏ8గా మైనర్లు ఉన్నారు. అన్ని వివరాలతో త్వరలోనే చార్జిషీట్ దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
వరంగల్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వంపై కుట్ర పన్ని పరీక్షల వ్యవస్థను దెబ్బతీసేలా, లక్షల మంది విద్యార్థులను ఆందోళన కలిగించేలా.. టెన్త్ హిందీ పరీక్ష పేపర్ లీక్ చేసిన కేసులో నిందితులకు శిక్షలు పడేలా వరంగల్ పోలీసులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. టెన్త్ పేపర్ లీకేజీ సూత్రధారులు, పాత్రధారులకు ఉన్న సంబంధాలు, వాట్సాప్లో పేపర్ను ఫార్వర్డ్ చేసిన ప్రక్రియపై సమగ్రంగా ఆధారాలను సేకరిస్తున్నారు. కుట్ర ఉద్దేశంతోనే టెన్త్ హిందీ పేపరు లీకేజీ చేసినట్లుగా చూసే ఆధారాలు ఇప్పటికే పోలీసులు సేకరించారు. పరీక్ష జరుగుతున్న సమయంలోనే పేపర్ ఫొటోలను వందల మందికి ఫార్వర్డ్ చేసి విద్యార్థుల్లో ఆందోళన కలిగించేందుకు కుట్ర పన్నిన నిందితుల్లో ఒకరితో ఒకరికి ఉన్న సంబంధాలు, వారి మాటలు, అమలు చేసిన ప్లాన్పై పూర్తి సాక్ష్యాలను సేకరిస్తున్నారు.
పరీక్ష రోజుకు ముందు ప్రధాన నిందితులు నిర్ణయించుకున్న కుట్ర ప్రణాళికను, ఇందులో భాగస్వాములుగా ఉన్న వారిని ఒక్కొక్కరిగా విచారిస్తున్నారు. ఈనెల 4న హనుమకొండ జిల్లా కమలాపూర్ ప్రభుత్వ బాలుర పాఠశాల నుంచి హిందీ పేపర్ ఫొటోను బయటకు తెచ్చి సోషల్ మీడియాలో విస్తృతంగా ఫార్వర్డ్ చేసిన కేసులో.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. రెండో నిందితుడి(ఏ2)గా మాజీ జర్నలిస్టు బూరం ప్రశాంత్, మూడో నిందితుడిగా కేఎంసీలో ల్యాబ్ అసిస్టెంట్ గుండెబోయిన మహేశ్, నాలుగో నిందితుడి(ఏ4)గా బాలుడు, ఐదో నిందితుడి (ఏ5)గా మౌటం శివగణేశ్, ఇదే కేసులో ఆరో నిందితుడి(ఏ6)గా పోగు సుభాష్, తొమ్మిదో నిందితుడి(ఏ9)గా పెరుమాండ్ల షర్మిక్, పదో నిందితుడి(ఏ10)గా పోతబోయిన వర్షిత్, ఏడో, ఎనిమిదో నిందితులుగా మైనర్లు ఉన్నారు. మొదటి ఐదుగురు నిందితులను వరంగల్ పోలీసు కమిషరేట్ పోలీసులు ఈనెల 5న అరెస్టు చేశారు. 120(బీ), 420, 447, 505(1), 4(ఏ), తెలంగాణ రాష్ట్ర పరీక్షల నిర్వహణ చట్టం 46, 8, 66(డీఐటీ) సెక్షన్ల కింద వీరిపై కమలాపూర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. అనంతరం అందరినీ అరెస్టు చేశారు. బండి సంజయ్, బూరం ప్రశాంత్, గుండెబోయిన మహేశ్కు హనుమకొండ కోర్టు బెయిలు మంజూరు చేసింది. మిగిలిన ఏడుగురు ఇంకా జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న వారిలో ముగ్గురు మైనర్లు. దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితులను విచారించారు. వారు ఇచ్చిన ఇచ్చిన వివరాల ఆధారంగా హిందీ పేపర్ లీకేజీ కుట్రలో పాత్ర ఉన్న ప్రతి ఒక్కరినీ విచారిస్తున్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఆయన పీఏలు రాజు, నరేందర్ను విచారించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ ప్రభుత్వ బాలుర పాఠశాల నుంచి హిందీ పేపర్ ఫొటోను బయటికి తెచ్చిన బాలుడితో కలిసి ఈ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న మౌటం శివ గణేశ్ పరీక్ష జరుగుతున్నప్పుడే (ఉదయం 9.59 గంటలకు) తన సెల్ఫోన్లోని వాట్సాప్ ద్వారా ఎస్ఎస్సీ 2019-20 వాట్సాప్ గ్రూపులోకి ఫార్వర్డ్ చేశాడు. హిందీ పరీక్ష పేపరు ఫొటోలు అక్కడి నుంచి ప్రధాన నిందితులుగా ఉన్న బూరం ప్రశాంత్, గుండెబోయిన మహేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి చేరాయి. కేసులో మరిన్ని ఆధారాల కోసం బూరం ప్రశాంత్కు పేపరు ఫొటోను పంపిన కార్తీక్ను అరెస్టు చేశారు. కార్తీక్ ఎస్ఎస్సీ 2019-20 వాట్సాప్ అడ్మిన్గా ఉన్నాడు. ఈ గ్రూపులోని మరికొందరికీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. టెన్త్ హిందీ పేపర్ లీకేజీ కోసం అమలు చేసిన కుట్రను వివరించేలా పోలీసులు ఈ కేసులో ఆధారాలు సేకరిస్తున్నారు. అన్ని వివరాలతో సమగ్రంగా త్వరలోనే చార్జిషీట్ను దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
మరో ఇద్దరికి బెయిల్..
టెన్త్ హిందీ పేపర్ లీకేజీ కేసులో ఆరో నిందితుడు పోగు సుభాష్, పదో నిందితుడు పోతబోయిన వర్షిత్కు బెయిలు మంజూరైంది. హనుమకొండ జిల్లా కోర్టు వీరిద్దరికీ షరతులతో కూడిన బెయిలు ఇచ్చింది. బెయిల్ రావడంతో వీరిద్దరు జైలు నుంచి విడుదలయ్యారు.
ప్రత్యేక పీపీ నియామకం..
టెన్త్ హిందీ పేపర్ లీకేజీ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా మోకిల సత్యనారాయణను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సత్యనారాయణ ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాసిక్యూషన్ డిప్యూటీ డైరెక్టరుగా, ఎస్సీఎస్టీ కోర్టు, హనుమకొండ జిల్లా పీపీగా పని చేస్తున్నారు. ఈ కేసులో ఈయన వాదనలు వినిపిస్తున్నారు.