స్టేషన్ ఘన్పూర్, జనవరి 19 : స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని దేవాదుల రిజర్వాయర్ల పరిధిలోని పంట కాల్వలకు మరమ్మతులు చేపట్టి ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి నీటిపారుదల శాఖ అధికారులను కోరారు. శుక్రవారం హైదరాబాద్లోని జలసౌధలో నీటిపారుదల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. శ్రీహరి మాట్లాడుతూ నియోజకవర్గంలోని దేవాదుల రిజర్వాయర్ల పరిధిలోని పంట కాల్వల్లో పూడికపేరుకుపోవడం, తూములు, షటర్లు సరిగ్గా పనిచేయకపోవడంతో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందడంలేదన్నారు. దీనిపై అధికారుల పర్యవేక్షణ సరిగా లేదన్నారు.
స్టేషన్ఘన్పూర్, మల్లన్నగండి, అశ్వరావుపల్లి, నవాబుపేట రిజర్వాయర్ల కట్టలపై మురికి తుమ్మలు పెరిగాయన్నారు. స్టేషన్ఘన్పూర్ రిజర్వాయర్ నుంచి నవాబుపేట రిజర్వాయర్కు వెళ్లే ప్రధాన కాల్వ మట్టితో కూడుకపోవడంతో చివరి ఆయకట్టుకు నీరు ఇవ్వడం లేదని తెలిపారు. కాల్వల్లో పూడిక మట్టిని తీసి, తూములు, షటర్లకు మరమ్మతులు చేపట్టాలని, అవసరమైన చోట కొత్త షటర్లు అమర్చాలన్నారు. స్టేషన్ ఘన్పూర్, నవాబుపేట రిజర్వాయర్ కాల్వల్లో లైనింగ్ పనులు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో ఇంజినీరింగ్ చీఫ్(ఓ అండ్ ఎం) నాగేందర్, చీఫ్ ఇంజినీర్ రమేశ్, ఎస్ఈ సుధీర్ పాల్గొన్నారు.