రాయపర్తి, జనవరి 20: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పదవులను తృణప్రాయంగా వదిలిన చరిత్ర దేశంలో ఒక్క బీఆర్ఎస్కే దక్కుతుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. మండలంలోని శివరామపురం(ఆర్అండ్ఆర్ కాలనీ) బస్టాండ్ కూడలిలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తాళ్లపల్లి నర్సయ్యగౌడ్ విగ్రహాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, నర్సయ్యగౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు, మాయమాటలతో గద్దెనెక్కిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేవరకూ రాష్ట్ర ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టంచేశారు.
రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్న ఆయన.. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో గడిచిన పదేళ్లలో సీఎం కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అద్భుతాలు సృష్టించిందన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పనిచేసిన నర్సయ్యగౌడ్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్.. కృష్ణ, గోదావరి నదులపై ప్రాజెక్టులు నిర్మించి నెర్రెలుబారిన నేలలకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేశారని గుర్తుచేశారు. పదేళ్ల కాలంలో 1.61 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు రాష్ర్టాభివృద్ధికి అధిక నిధులు తెచ్చారని గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 47 రోజులు పూర్తయిందని, ఇచ్చిన హామీల అమలు కోసం మరో 53రోజులు వేచి చూసిన తర్వాత బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు.
ఎర్రబెల్లి మాట్లాడుతూ నర్సయ్యగౌడ్ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటున్నదన్నారు. కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకులు సుబ్బారావు, మేకల రవి, తమ్మెర విశ్వేశ్వర్రావు, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, కర్ర రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్, ఆర్బీఎస్ మండల కో ఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, సర్పంచ్ చెడుపాక కుమారస్వామి, నాగపురి సోమయ్య, గాజు యాకయ్య, గారె నర్సయ్య, ఉస్మాన్, తాళ్లపల్లి సంతోష్గౌడ్, కుటుంబ సభ్యులు తాళ్లపల్లి శాంతమ్మ, తండాల శోభారాణి-చంద్రప్రకాశ్, అప విజయ, తేజస్వి, శ్రుతి, రవితేజ పాల్గొన్నారు.