ఇనుగుర్తి మండలకేంద్రం ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, ఎంపీలు మాలోత్ కవిత, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తరలిరాగా.. గ్రామస్తులు పూలుచల్లుతూ డప్పుచప్పుళ్లు, బతుకమ్మలతో వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించి, తహసీల్దార్ ఆబిద్ అలీని కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కేంద్రం సహకరించకున్నా సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు. మంత్రి సత్యవతి మాట్లాడుతూ.. సీమాంధ్ర నాయకులు మానుకోట రాళ్లను మరిచిపోయినా ఇక్కడి ప్రజలు మరిచిపోలేదని, షర్మిల నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని హెచ్చరించారు. ఇనుగుర్తి మండల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కేసముద్రం, డిసెంబర్ 4 : ఇనుగుర్తి మండలకేంద్ర ప్రారంభ కార్యక్రమం ఆదివారం అట్టహాసంగా జరిగింది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎంపీలు మాలోత్ కవిత, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ తరలిరాగా గ్రామస్తులు పూలుచల్లుతూ డప్పుచప్పుళ్లు, బతుకమ్మలతో వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించి, తహసీల్దార్ అబిద్ అలీని కుర్చీలో కూర్చోబెట్టి, స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ.. ఇనుగుర్తి పక్కనున్న గొడ్లకొండ గ్రామంలో 20 సంవత్సరాల క్రితం తాను స్వయంగా వ్యవసాయం చేసినప్పుడు నీరు, కరంట్ లేక పంట ఎండిపోయి నష్టం వచ్చిందన్నారు. కరంట్, సాగు నీరు కోసం ధర్నాలు చేసి జైలుకు వెళ్లినట్లు గుర్తు చేశారు. డిసెంబర్ నెల వచ్చే వరకు చెరువులన్నీ ఎండిపోయేవన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టారన్నారు. మిషన్ కాకతీయతో చెరువులను బలోపేతం చేసినట్లు తెలిపారు. గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి చెరువులకు నీరు ఇవ్వడంతో వేసవి కాలంలోనూ జలకళను సంతరించుకున్నాయన్నారు. రైతుబంధు ద్వారా ఒక్క ఇనుగుర్తి గ్రామానికే ఇప్పటి వరకు రూ.8 కోట్లు అందించినట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం మోటర్లకు మీటర్లు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తుందన్నారు. ప్రాణం ఉన్నంత వరకు రైతులకు నష్టం కలిగించే పని చేయనని, మోటర్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ కేంద్రానికి తేల్చి చెప్పారని అన్నారు. మోదీ మాట వినకపోవడంతో రాష్ట్రంలోని టీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టి ఐటీ దాడులు చేయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని అన్నారు.
నేను ఎక్కడికి వెళ్లినా ఈ ఊరి బిడ్డనేనని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. 1985 సంవత్సరంలోనే ఇనుగుర్తి మండల కేంద్రంగా నాటి ప్రభుత్వం ప్రకటించి వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు. ఇనుగుర్తి మండల కేంద్రంగా గుర్తించడానికి అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ కాలం కలిసి రాలేదన్నారు. 37 ఏళ్ల నుంచి ఇనుగుర్తి ప్రజలు మండలం కోసం ఎదురు చూశారని అన్నారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2016లో కొత్త మండలాల ఏర్పాటు సమయంలోనూ కొన్ని సాంకేతిక కారణాలతో మండల కేంద్రంగా గుర్తించలేదన్నారు. కాకతీయులు పాలించిన ఇనుగుర్తికి సీఎం కేసీఆర్ కొత్త రూపం ఇచ్చారన్నారు. జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వీ ప్రకాశ్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి తదితరులు ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడిన సీమాంధ్ర నాయకులు మానుకోట రాళ్లను మరిచిపోయినా ఈ ప్రాంత ప్రజలు ఇంకా మరిచిపోలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. సీమాంధ్రకు చెందిన ఓ మహిళ తన మాటలను అదుపులో పెట్టుకోవాలని, సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తే సహించేది లేదన్నారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజ ల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపా రు. కల్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రులకు కొండంత అండగా ఉంటుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నా రా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ పాలనలో ఆ పార్టీకి చెందినోళ్లకే ప్రభుత్వ పథకాలు ఇచ్చేవారని, కేసీఆర్ పార్టీలకతీతంగా పథకాలు అందిస్తున్నారన్నారు. రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించినట్లు తెలిపారు. మహబూబాబాద్లో రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ, రూ.50 కోట్లతో కలెక్టరేట్ భవనం నిర్మించినట్లు తెలిపారు.
పేద ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ను, ప్రభుత్వాన్ని విమర్శిస్తే సహించేది లేదని ఎంపీ కవిత అన్నారు. మీ నాన్న, మీ అన్న తెలంగాణకు చేసిన ద్రోహాన్ని గుర్తు చేసుకోవాలని షర్మిలకు సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడుగడుగునా అడ్డుపడిన విషయాన్ని ఈ ప్రాంత ప్రజలు మరిచిపోలేదన్నారు. రాజన్న రాజ్యం అంటే తెలంగాణ రాష్ర్టాన్ని మళ్లీ ఆంధ్రప్రదేశ్లో కలుపుతావా అని ప్రశ్నించారు. మీ నాన్న 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తే సీఎం కేసీఆర్ 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నాడనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ సంపదైన బయ్యారం ఇనుప ఖనిజాన్ని మీరు తీసుకెళ్లిన విషయాన్ని ఇక్కడి ప్రజలు మరిచిపోలేదన్నారు. తెలంగాణ సంపదను దోచుకునేందుకే షర్మిల యాత్రల పేరుతో నాటకాలు చేస్తున్నదని ఆరోపించారు. బయ్యారంలో ఉక్కుఫ్యాక్టరీ నిర్మించాల్సిన కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తున్నారు. ఇనుగుర్తి మండల ఏర్పాటులో జాప్యమైనప్పటికీ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలుపుకున్నట్లు తెలిపారు. నూతనంగా ఏర్పడిన ఇనుగుర్తిని కలిసికట్టుగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.