హనుమకొండ చౌరస్తా, జూలై 2 : ప్రయాణికుల గుండెల్లో గుబులు పుట్టించిన ఎలక్ట్రిక్ బస్సులు బంద్ అయ్యాయి. వరుసగా అగ్ని ప్రమాదాల బారిన పడుతుండడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాల మేరకు గురువారం నుంచి డిపోకే పరిమితమయ్యాయి. పర్యావరణహితం, నిశ్శబ్ధ ప్రయాణం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా వరంగల్ రీజియన్ పరిధిలోని వరంగల్-2 డిపోను ఈ బస్సుల నిర్వహణ కోసం జేబీఎం సంస్థకు ప్రత్యేకంగా కేటాయించింది.
అయితే, ప్రారంభించినప్పటి బస్సులు సాంకేతిక లోపంతో ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు ఇటీవల బ్యాటరీల్లో షార్ట్సర్క్యూట్ కారణంగా బస్సులు కాలిపోతున్నాయి. గత నెలలో వరంగల్-2 డిపోలోనే రెండు బస్సులు షార్ట్సర్క్యూట్తో కాలిపోగా వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పివేశారు. జూన్ 21న కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు అల్గునూర్ వద్ద మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతతో 37 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అలాగే, ఈ నెల 1న కరీంనగర్-2 డిపోలో చార్జింగ్ పెడుతుండగా మరో బస్సు అకస్మాత్తుగా మంటలంటుకొని కాలిపోయింది.
డిపోకే పరిమితమైన బస్సులు..
ఒప్పందం ప్రకారం వరంగల్ రీజియన్ పరిధిలో నడుస్తున్న ఈ బస్సుల రోజువారీ సర్వీసింగ్, బ్యాటరీల మేనేజ్మెంట్, వైరింగ్ తనిఖీలు, చార్జింగ్, రిపేర్ల బాధ్యత అంతా జేబీఎం సంస్థ చూసుకుంటుంది. ఆర్టీసీ కేవలం కిలోమీటరు ప్రాతిపదికన ఆ సంస్థకు డబ్బులు చెల్లిస్తుంది. ఇందుకోసం డిపోల్లో ఆ సంస్థకు చెందిన ప్రత్యేక సాంకేతిక బృందాలు పనిచేస్తున్నాయి. వారు ప్రతి ఎలక్ట్రిక్ బస్సును చెక్ చేసి పంపిస్తారు. గత ఏడాది జనవరి 6న 50 ఎలక్ట్రిక్ బస్సులతో రవాణా సేవలు ప్రారంభించగా, క్రమంగా వాటిని 115కు పెంచారు. వీటిలో పల్లె వెలుగు తప్ప ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులు నడిపించారు. అయితే ప్రారంభించినప్పటి నుంచి సాంకేతిక లోపంతో ఎక్కడో ఒక చోట బస్సులు నిలిచిపోతూ ప్రయాణికులకు నరకాన్ని చూపిస్తున్నా యి.
ఇటీవల అగ్ని ప్రమాదాలకు గురవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రత, చార్జింగ్ ఎక్కువ కావడం, హై వోల్టేజీ కారణంగా బ్యాటరీలు షార్ట్ సర్క్యూట్కు గురై మంట లు వేగంగా వ్యాపించి క్షణాల్లో బస్సులు దగ్ధమవుతున్నాయని ఆర్టీసీ అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. అలాగే, ఒక బస్సులో మొత్తం 12 బ్యాటరీలుండగా అందులో ఏదో ఒకటి నిత్యం కాలిపోతున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఎలక్ట్రిక్ బస్సులను నిలిపివేయాలని జేబీఎం సంస్థను ఆదేశించింది. దీంతో వరంగల్-2 పరిధిలోని బస్సులన్నీ గురువారం నుంచి డిపోకే పరిమితమయ్యాయి. దీంతో సరిపడా బస్సుల్లేక ప్రయాణికులు గంటల తరబడి బస్ స్టేషన్లలోనే వేచిచూశారు.