ఖిలావరంగల్, ఏప్రిల్ 3: ఎన్నికలు ప్రశాంత వాతావరంణంలో జరిగేలా సిబ్బంది చూడాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఎన్నికల కంట్రోల్ రూమ్ను బుధవారం తనిఖీ చేశారు. ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూం పనితీరుపై ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో ఖర్చులు, ప్రకటనలు, ప్రచారాలు, కార్యక్రమాలను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన ఎంపీసీ, ఎస్ఎస్టీ బృందాలు సమర్థవంతంగా పని చేయాలన్నారు. అన్ని విభాగాల నోడల్ బృందాలు సమన్వయంతో నివేదికలను సకాలంలో ఎన్నికల కమిషన్కు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీ విజిల్ యాప్, 1950 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా వస్తున్న ఫిర్యాదులు, పరిష్కార వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు యాప్ ద్వారా రెండు ఫిర్యాదులు, 1950 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా 25 కాల్స్, నేషనల్ గ్రీవెన్స్ సర్వీస్ పోర్టల్ ద్వారా 162 ఫిర్యాదులు స్వీకరించి, పరిష్కరించినట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో రామిరెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి పుష్పలత, పరిపాలనా అధికారి శ్రీకాంత్, జిల్లా మేనేజర్ రాజ్కుమార్ పాల్గొన్నారు.
రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశామని కలెక్టర్ తెలిపారు. వరంగల్ తూర్పు, నర్సంపేట, వర్ధన్నపేటకు కేటాయించిన బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్ల ర్యాండమైజేషన్ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని ఈ మూడు నియోజవర్గాల్లోని 792 కేంద్రాలకు సంబంధించిన బ్యాలెట్ యూనిట్లు 1,808, కంట్రోల్ యూనిట్లు 1,029, (125 శాతం), వీవీ ప్యాడ్స్(140 శాతం) 1,172ను ఎన్నికల నిబంధనల మేరకు కేటాయించామని వివరించారు. కార్యక్రమంలో కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీవో కృష్ణవేణి, డీఆర్వో శ్రీనివాస్ పాల్గొన్నారు.
వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మిషన్ భగీరథతో పాటు ప్రత్యామ్నాయ నీటి వనరులను సిద్ధం చేయాలన్నారు. స్థానికంగా ఉన్న నీటి వనరులను వినియోగిచుకోవడంతో పాటు బోరు బావులకు తక్షణమే మరమ్మతులు చేయించాలన్నారు. నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీలు, మండలాల వారీగా తాగునీటి ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో తాగునీటి సరఫరా పర్యవేక్షణకు ప్రభుత్వం రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులు గోపిని నియమించినట్లు తెలిపారు. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అత్యవసరం అయితే గానీ బయటికి వెళ్లొద్దని ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఉపాధి హామీ కూలీలకు ఎండ తీవ్రతను బట్టి పనులు కేటాయించాలన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు పరిషరించాలని ఆదేశించారు. సమావేశంలో డీపీవో కల్పన, డీఆర్డీవో కౌసల్యాదేవి పాల్గొన్నారు.