పరకాల, నవంబర్ 29 : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 239 పోలింగ్ స్టేషన్లు ఉండగా 2,21436మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందు లో మహిళా ఓటర్లు 1,13,154మంది, పురుషులు 1,08,280 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారు. గురువారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది బుధవారం సాయంత్రమే పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 44 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉండగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మహిళల కోసం మండలానికి ఒక్కటి చొప్పున ప్రత్యేకంగా ఐదు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటును సద్వినియోగం చేసుకోవాలని ఆర్వో కే శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఆత్మకూరు : మండలంలోని పోలింగ్ కేంద్రాలల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తహసీల్దార్ సురేశ్కుమార్ తెలిపారు. మండలంలోని 16 గ్రామాల్లో 32 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రం ఈవీఎంలతో పోలింగ్ సిబ్బంది, పోలీస్ బందోబస్తు మధ్య పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మండలంలో మొత్తం 27,921 మంది ఓటర్లు ఉండగా, అందులో13,588 మంది పురుషులు, 14,333 మంది స్త్రీలు ఉన్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుందని తెలిపారు. కాగా, ఎవరైనా ఎన్నికల కోడ్ను అతిక్రమిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని సీఐ రవిరాజు హెచ్చరించారు. అలాగే, మండలంలోని పోలీంగ్ కేంద్రాలను ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్ సురేశ్కుమార్, ఎస్సైలు ప్రసాద్, రాజేశ్రెడ్డి పరిశీలించారు.
దామెర : మండలంలో పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. మండల వ్యాప్తంగా 14 గ్రామాలు ఉండగా 21,705 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 10,574 మంది ఉండగా, 11,131మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు మండల వ్యాప్తంగా 24 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
నడికూడ : మండల కేంద్రానికి పోలింగ్ బూత్ సిబ్బంది బుధవారం సాయంత్రం చేరుకున్నారు. జడ్పీహెచ్ఎస్లో 33, 34, 35 బూత్లలో నలుగురు చొప్పున సిబ్బంది ఓటింగ్ యంత్రాలతో హాజరయ్యారు. వారికి కావాల్సిసిన సౌకర్యాలను సిబ్బంది సమకూర్చుతున్నారు.
గీసుగొండ : గీసుగొండ మండలంతో పాటు 15, 16వ డివిజన్లలో ఎన్నికల నిర్వహణకు అధికారులు 52 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 50,785 ఓటర్లు ఉండగా 24,801 మంది పురుషులు, 25983 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్జెండర్ ఉన్నట్లు ఏఆర్వో, తహసీల్దార్ రియాజుద్దీన్ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు మండలాన్ని మూడు రూట్లుగా విభజించారు. 312 మంది అధికారులు విధుల్లో పాల్గొంటున్నారు. 520 మంది పోలీసులు బందోబస్తులో ఉంటున్నారు.
సంగెం : మండలంలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్, మంచినీరు తదితర వసతులు కల్పించారు. మండలంలోని 33 గ్రామపంచాయతీలకు 44 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మండలంలో 40,224 మంది ఓటర్లు ఉండగా పురుషులు 19,888, స్త్రీలు 20,336 ఉన్నారు. సజావుగా ఎన్నికలు జరిగేందుకు పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సందర్బంగా ఎస్సై ఎం భరత్ మాట్లాడుతూ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.