జనగామ చౌరస్తా, మార్చి 28 : జనగామ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దామోదర్రెడ్డిపై ఎన్నికల సంఘం(ఈసీ) బదిలీ వేటు వేసింది. వెంటనే డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆయనకు బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇటీవల పెంబర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి తనయుడు ప్రశాంత్రెడ్డితో కలిసి ఏసీపీ దామోదర్రెడ్డి ప్రారంభించారు. ఇదే సమయంలో జనగామ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి తిరుగు ప్రయాణంలో సమీపంలో ఉన్న టీ స్టాల్ వద్ద ఆగి స్థానిక మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లతో కలిసి టీ తాగుతుండగా ఆ ఏరియాలోని ఫుట్పాత్పై పండ్లు, కూరగాయలు విక్రయించుకునే చిరు వ్యాపారులు వచ్చి తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు అనవసర రాద్ధాంతం చేసి, ఉన్నత స్థాయి అధికారులతో స్థానిక అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఎమ్మెల్యే పల్లా ఎలక్షన్ వయోలేషన్కు పాల్పడ్డారని ఎఫ్ఐఆర్ నమోదుకు తహసీల్దార్ ద్వారా ఉత్తర్వులు జారీ చేయించారు.
దీంతో చిరు వ్యాపారుల సమస్యలను స్థానిక ఎమ్మెల్యేగా వినడం ఎలక్షన్ వయోలేషన్ కిందకు వస్తే, పెంబర్తిలో ఓ కాంగ్రెస్ నాయకుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆ పార్టీ శ్రేణులు, అధికారులు కలిసి ప్రారంభించడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు రాదా? అని ఎమ్మెల్యే పల్లా ‘నమస్తేతెలంగాణ’ ద్వారా ప్రశ్నించారు. అనంతరం పలు దినపత్రికల్లో వచ్చిన వార్తా కథనాల ఆధారాలతో పాటు లిఖిత పూర్వకంగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపిన ఎన్నికల సంఘం ఏసీపీ దామోదర్రెడ్డిపై బదిలీ వేటు వేసింది. కాగా, ఫిబ్రవరిలోనే ఏసీపీగా విధుల్లో చేరిన దామోదర్రెడ్డి కేవలం నెలన్నర వ్యవధిలో బదిలీ కావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అతి త్వరలోనే జనగామకు మరో కొత్త ఏసీపీని డీజీపీ నియమించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.