నర్సంపేట, డిసెంబర్ 20: నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నారని మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పట్టణాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని కొనియాడారు. నర్సంపేటలో రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ భవనాలు, డివైడర్లు, పార్కు, సెంట్రల్ లైటింగ్ పనులు చేస్తున్నట్లు వెల్లడించారు.
రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ద్వారా పట్టణ అభివృద్ధికి గతంలో రూ. 35 కోట్ల నిధులు మంజూరు చేయించారని తెలిపారు. ఇప్పుడు రూ. 15 కోట్లు మంజూరు చేయించారని వెల్లడించారు. ఈ నిధులతో పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చనున్నట్లు వివరించారు. ప్రధాన రోడ్ల వెంట డ్రైనేజీలతోపాటు సల్లేట్ డ్రైనేజీని నిర్మించేందుకు ఈ నిధులు ఉపయోగపడుతాయన్నారు.
మాదన్నపేట కాల్వ పక్క నుంచి డ్రైనేజీ నీరు వెళ్లేందుకు వీలుగా నిర్మాణం చేస్తామన్నారు. నిర్మాణ పనులకు త్వరలో టెండర్లు పూర్తి చేయనున్నట్లు చెప్పారు. నర్సంపేటలో ఇప్పటికే సెంట్రల్ లైటింగ్, డివైడర్లు, రోడ్డు నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. మిగిలిన పనులకు నిధులు మంజూరు చేయించి వచ్చే ఏడాదిలో పూర్తి చేయిస్తామని తెలిపారు. మున్సిపాలిటీ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్ నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. సమావేశంలో కౌన్సిలర్లు మినుముల రాజు, శీలం రాంబాబు, జుర్రు రాజు, గోల్యానాయక్, దార్ల రమాదేవి, దేవోజు తిరుమల, శ్రీదేవి, బానాల ఇందిర, బీఆర్ఎస్ నాయకులు నాగిశెట్టి ప్రసాద్, చంద్రమౌళి పాల్గొన్నారు.