కరీమాబాద్, ఫిబ్రవరి 1 : నగర ప్రజలు అబ్బురపడేలా ఉర్సు రంగలీలా మైదానంలోని ఉర్సు బండ్ను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. రంగలీలా మైదానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను బుధవారం పరిశీలించారు. అనంతరం రెవెన్యూ, జీడబ్ల్యూఎంసీ, స్మార్ట్సిటీ, పలు శాఖల అధికారులతో సమీక్షించారు. రూ. 15 కోట్లతో ఉర్సు బండ్ను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. వాకర్స్కు ట్రాక్తో పాటు ఓపెన్ జిమ్ను ఏర్పాటు చేస్తామన్నారు. చెరువు కట్టపై గ్రీనరీ, లైటింగ్ ఏర్పాటు చేసి ట్యాంకుబండ్ తరహాలో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. చెరువుపై కేబుల్ బ్రిడ్జిని ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతామన్నారు. ఉర్సు గుట్ట, ఉర్సు చెరువుకు వారం రోజుల్లో హద్దులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంచు జాగాను కూడా అన్యాక్రాంతం కానివ్వమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రవి, మాజీ కార్పొరేటర్ పల్లం రవి, బీఆర్ఎస్ 40వ డివిజన్ అధ్యక్షుడు పూజారి విజయ్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మల్ల అంబేద్కర్, బీఆర్ఎస్ నాయకులు నాగపురి సంజయ్బాబు, మేడిది మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తా..
ఖిలావరంగల్ : కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. వరంగల్ 37వ డివిజన్ తూర్పుకోటలో శ్రీవేంకటేశ్వర భవన నిర్మాణ కార్మికుల కోసం రూ. 50 లక్షలతో కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం స్థల దాత బోడకుంట్ల కృష్ణను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తూర్పుకోట భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారం కమ్యూనిటీ భవనాన్ని నిర్మిస్తున్నామన్నారు. అదనంగా 100 గజాల స్థలం కొనుగోలు కోసం రూ. 5 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. 37వ డివిజన్ను ఇప్పటికే రూ. 5 కోట్ల నిధులతో అభివృద్ధి చేశామన్నారు. మరో రూ. 4 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ భోగి సువర్ణ, మాజీ కార్పొరేటర్ బిల్లా కవిత, ఏఈ సౌజన్య, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సంగరబోయిన విజయ్, మత్స్యశాఖ సొసైటీ చైర్మన్ సంగరబోయిన చందర్, బీఆర్ఎస్ నాయకులు వనపర్తి కరుణాకర్, నలిగంటి నవీన్, మంద శ్రీధర్రెడ్డి, వెంకటేశ్వర భవన నిర్మాణ సంఘం నాయకులు పాల్గొన్నారు.
రాజన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు
పోచమ్మమైదాన్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్నను ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ దంపతులు బుధవారం దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వేమువాడ వెళ్లిన వారు ప్రత్యేక పూజలు చేశారు.