వరంగల్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర మంత్రివర్గంలో ఉమ్మడి వరంగల్ నుంచి ఎవరెవరికి బెర్తులు ఖాయమవుతాయన్నదానిపై జోరుగా చర్చ నడుస్తున్నది. ఉమ్మడి జిల్లాలోని 10అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ గెలవగా, ‘మంత్రి పదవి’ రేసులో ములుగు నుంచి ధనసరి అనసూయ (సీతక్క), వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖ, నర్సంపేట నుంచి దొంతి మాధవరెడ్డి ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీతక్కతో పాటు మరొకరికి అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. మరోవైపు హనుమకొండ జిల్లాలో భాగంగా ఉన్న హుస్నాబాద్ నుంచి గెలిచిన పొన్నం ప్రభాకర్, భూపాలపల్లి జిల్లాలో భాగమైన మంథని నుంచి దుద్దిళ్ల శ్రీధర్బాబుకు సైతం చోటుండే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
కొత్త మంత్రివర్గంలో ఉమ్మడి జిల్లా నుంచి చోటు ఎవరికి దక్కుతుందని ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఉమ్మడి జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. ములుగులో ధనసరి అనసూయ(సీతక్క), వరంగల్ తూర్పులో కొండా సురేఖ, నర్సంపేటలో దొంతి మాధవరెడ్డి, పరకాలలో రేవూరి ప్రకాశ్రెడ్డి, పాలకుర్తిలో మామిడాల యశస్విని, డోర్నకల్లో జాటోత్ రాంచంద్రునాయక్, మహబూబాబాద్లో భూక్య మురళీనాయక్, వరంగల్ పశ్చిమలో నాయిని రాజేందర్రెడ్డి, వర్ధన్నపేటలో కె.ఆర్.నాగరాజు, భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణరావు విజయం సాధించారు. కొండా సురేఖ ఐదోసారి, రేవూరి ప్రకాశ్రెడ్డి నాలుగోసారి, సీతక్క మూడోసారి, దొంతి మాధవరెడ్డి రెండోసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. గిరిజనుల్లో ముఖ్యంగా ఆదివాసీ మహిళా ఎమ్మెల్యేగా ములుగు ఎమ్మెల్యే సీతక్కకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు ఖాయమనే చర్చ కొనసాగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీతక్కకు కీలక శాఖ దక్కుతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సీతక్కతోపాటు ఉమ్మడి జిల్లా నుంచి మరొకరికి మంత్రి పదవి దక్కతుందని గెలిచిన ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.
సీనియర్ ఎమ్మెల్యే కొండా సురేఖ, దొంతి మాధవరెడ్డిలో ఎవరో ఒకరికి మంత్రి పదవి వస్తుందని హస్తం పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సామాజిక సమీకరణలో భాగంగా బీసీల కోటాలో కొండా సురేఖ, ఉమ్మడి జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా దొంతి మాధవరెడ్డికి అవకాశాలు ఉంటాయని తెలుస్తున్నది. సీతక్క, కొండా సురేఖ, దొంతి మాధవరెడ్డిలో ఇద్దరికి మంత్రి పదవులు, మరొకరికి మరో కీలక పదవి దక్కుతుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమైక్య ఆంధ్రప్రదేశ్లో వరంగల్ ఉమ్మడి జిల్లాకు రెండు మంత్రి పదవులతోపాటు ఒక చీఫ్విప్ లేదా విప్ పదవి కేటాయించారు. తెలంగాణ రాష్ట్రంలోనూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు మంత్రి పదవులు, ఇతర కీలక పదవుల పరంగా ప్రాతినిధ్యం పెరిగింది. 2014లో ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా టీ రాజయ్య, మంత్రిగా అజ్మీరా చందులాల్ బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి జిల్లా నుంచి అసెంబ్లీ స్పీకర్గా సరికొండ మధుసూదనాచారికి అరుదైన అవకాశం దక్కింది.
తర్వాత జరిగిన మార్పుల్లో టీ రాజయ్య స్థానంలో కడియం శ్రీహరికి ఉప ముఖ్యమంత్రిగా బీఆర్ఎస్ అవకాశం ఇచ్చింది. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి శాసనమండలిలో విప్గా పని చేశారు. 2018 ఎన్నికల తర్వాత ఇదే పరంపర కొనసాగింది. ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ మంత్రులుగా, దాస్యం వినయ్భాస్కర్ ప్రభుత్వ చీఫ్విప్గా పని చేశారు. వీరితోపాటు శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా బండా ప్రకాశ్, చీఫ్ విప్గా బోడకుంటి వెంకటేశ్వర్లుకు అవకాశాలు వచ్చాయి. తెలంగాణలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు మంత్రివర్గంలో, ఇతర కీలక పదవుల్లో ప్రాతినిధ్యం పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఇదే పరంపర కొనసాగుతుందని కాంగ్రెస్ వర్గాలు ఆశిస్తున్నాయి. ఎప్పటిలాగే ఉమ్మడి జిల్లాకు రెండు మంత్రి పదవులతోపాటు మరో కీలక పదవి కచ్చితంగా దక్కుతుందని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సామాజిక సమీకరణల్లో భాగంగా మరికొందరికి వివిధ ప్రభుత్వ పదవులు దక్కుతాయనే అంచనాలు ఉన్నాయి.
మరో ఇద్దరు..
భూపాలపల్లి పరిధిలోని మంథని నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దుద్దిళ్ల శ్రీధర్బాబు, హనుమకొండ జిల్లాలో భాగంగా ఉన్న హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన పొన్నం ప్రభాకర్కు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే అంచనాలున్నాయి. దుద్దిళ్ల శ్రీధర్బాబు ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 2009 నుంచి 2014 వరకు మంత్రిగా పని చేశారు. బ్రాహ్మణ సామాజికవర్గం నుంచి శ్రీధర్బాబు సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నేపథ్యంలో శ్రీధర్బాబుకు మరోసారి మంత్రి పదవి దక్కుతుందని తెలుస్తున్నది. బీసీల్లోని గౌడ సామాజికవర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్, గతంలో కరీంనగర్ ఎంపీగా పని చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోటాలోనూ ఇద్దరికి మంత్రి పదవి ఉండనున్నది. దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్కు ఈ అవకాశం దక్కతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. వీరిద్దరికీ పదవులు వస్తే ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో భాగంగా ఉన్న జిల్లాలకు అదనంగా మంత్రి పదవులు దక్కినట్లే అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పదవి దక్కే నాయకుడి ఆధారంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎవరికి పదవులు దక్కుతాయనే విషయంలో స్పష్టత రానున్నది. పార్టీ, ఉమ్మడి వరంగల్ జిల్లా, సామాజిక సమీకరణ పరంగా పదవుల పందేరం ఉండనున్నది.