నర్సింహులపేట, ఏప్రిల్ మండలంలోని బాసుతండా గ్రామ తాగునీటికి ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ‘తాగునీటికి తండ్లాట’ ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. పంచాయతీరాజ్ అధికారి హరిప్రసాద్, భగీరథ ఎస్ఈ తండాను సందర్శించారు. ఈ సమయంలో తండావాసులు వారితో వాగ్వాదానికి దిగారు. ఉగాది పండుగ పూట నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గోడు వెల్లబోసుకున్నారు. మంచినీటి బావికి వెంటనే కొత్త మోటర్ ఏర్పాటు చేయించారు.
మిషన్ ట్యాంకుకు నీటిని విడుదల చేశారు. తండాలో ఇంటింటికీ తాగునీరు వచ్చేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలని, అందరికీ సమానంగా నీరు అందేలా గేట్వాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. విధులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. తండాకు తాగునీరు వచ్చేలా కృషిచేసిన ‘నమస్తే తెలంగాణ’కు తండావాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీవో సోంలాల్, ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ ఏఈలు వెంకటేశ్వర్రెడ్డి, రాకేశ్, కార్యదర్శి మౌనిక, సాయి, నర్సయ్య ఉన్నారు.