గిర్మాజీపేట, ఫిబ్రవరి 6 : జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాల్లో ఇప్పటివరకు 79,776 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో కాజీపేట వెంకటరమణ తెలిపారు. 17,435 మందికి రీడింగ్ గ్లాసులు అందజేశామని, 10,329 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ ఇచ్చినట్లు చెప్పారు. కంటివెలుగు ప్రోగ్రాంలో జిల్లా రాష్ట్రంలో ఆరో స్థానంలో ఉందన్నారు. కలెక్టరేట్, ఐఎంఏ హాల్, ఎనుమాముల మార్కెట్లో కూడా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో 18 గ్రామ పంచాయతీలు, 7 వార్డుల్లో కంటి పరీక్షలు పూర్తయ్యాయని, 25 జీపీలు, 19 వార్డుల్లో త్వరలోనే పూర్తవుతాయని తెలిపారు. జిల్లాలో 79,776 మందికి కంటిపరీక్షలు నిర్వహించగా, అందులో 36,437 మంది పురుషులు, 43,278 మంది స్త్రీలు, 42 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారన్నారు. 13,566 మంది ఎస్సీలు, 5,684 ఎస్టీలు, 54,202 బీసీలు, 3,925 ఓసీలు, 2,380 మంది మైనార్టీలకు పరీక్షలు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లో 52,012 మందికి కంటి సమస్యలు లేవని చెప్పారు.
కాశీబుగ్గ, ఫిబ్రవరి 6 : సీఎం కేసీఆర్ నిరుపేద, మధ్య తరగతి ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని కంటి వెలుగు కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. మాలాంటి పేదవారికి ఇది ఎంతగానో ఉపయోగ పడుతున్నది. ప్రైవేట్ దవాఖానలో కంటి పరీక్షలు చేయించుకుని అద్దాలు కొనుగోలు చేయాలంటే పేదలకు చాలా కష్టంగా మారింది. కంటి వెలుగు కార్యక్రమంలో ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకొని అద్దాలు కూడా పొందాం. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– బీ వైష్ణవి, కాశీబుగ్గ