జనగామ చౌరస్తా, జనవరి 11: జనగామ జిల్లాలో రెండు అవినీతి తిమింగలాలు ఏసీబీకి చిక్కాయి. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ శేపూరి ప్రశాంత్, జూనియర్ అసిస్టెంట్ ఎండీ అజాద్ రూ. 50 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన కాముని స్రవంతి మండలంలోని ఓబుల్ కేశవాపూర్ పీహెచ్సీలో ఔట్సోర్సింగ్ ఫార్మాసిస్ట్గా మూడేళ్ల నుంచి పనిచేస్తున్నది. ఈమె స్థానంలో 2023 అక్టోబర్లో రెగ్యులర్ ఫార్మాసిస్టు విధుల్లో చేరగా, స్రవంతిని రఘునాథపల్లి పీహెచ్సీకి మార్చారు. అక్కడ వారం రోజుల పాటు పనిచేయగానే ఉన్నఫళంగా విధుల నుంచి తొలగిస్తున్నట్లు డీఎంహెచ్వో కార్యాలయం నుంచి సమాచారం అందింది. దీంతో బాధితురాలు తీవ్ర మనోవేదనకు గురై డీఎంహెచ్వో డాక్టర్ ప్రశాంత్ను కలిసి తనను ఉద్యోగం నుంచి తొలగించొద్దని వేడుకుంది. ఈ క్రమంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగంలో కొనసాగాలన్నా, 2 నెలల వేతనం చెల్లించాలన్నా రూ. లక్ష ఇవ్వాలని జూనియర్ అసిస్టెంట్ అజార్ ద్వారా డీఎంహెచ్వో డిమాండ్ చేశారు.
దీంతో స్రవంతి వరంగల్ అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించింది. వారం రోజుల కింద మొదటి విడుతగా రూ.50 వేలను జూనియర్ అసిస్టెంట్ అజార్ చెప్పిన విధంగా డీఎంహెచ్వో కార్యాలయం డిప్యూటీ డీఎంహెచ్వోకు సంబంధించిన టేబుల్ డ్రాలో పెట్టింది. ఆ తర్వాత రెండోసారి గురువారం మిగతా రూ.50 వేల నగదును డీఎంహెచ్వో డాక్టర్ ప్రశాంత్ చాంబర్లోని టేబుల్ డ్రాలో స్రవంతి పెడుతున్న క్రమంలో ఏసీబీ అధికారులు డీఎంహెచ్వో, జూనియర్ అసిస్టెంట్ అజార్ను పట్టుకున్నారు. నిందితులిద్దరూ లంచం డబ్బులను నేరుగా ముట్టుకోకపోయినా, బాధితురాలు స్రవంతితో సెల్ఫోన్లో మాట్లాడిన ఆడియో రికార్డులు, లంచం నగదును టేబుల్ డ్రాలో పెట్టమన్న వీడియో రికార్డుల ఆధారంగా డీఎంహెచోవ్ డాక్టర్ ప్రశాంత్తో పాటు జూనియర్ అసిస్టెంట్ అజార్పై కేసు నమోదు చేశారు. నిందితులిద్దరినీ శుక్రవారం హైదరాబాద్ ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. కాగా, మరో 3 నెలల్లో డీఎంహెచ్వో ప్రశాంత్ రిటైర్మెంట్ అవుతున్నట్లు తెలిసింది. కార్యక్రమంలో ఏసీబీ ఇన్స్పెక్టర్లు జే శ్యామ్సుందర్, కే శ్రీను, ఎన్ రవీందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.