వరంగల్ చౌరస్తా, మార్చి 22: వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో మందులను దొడ్డిదారిన కాజేసిన ఉద్యోగి తలకోటి నాగేందర్పై శాఖాపరమైన చర్యలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో సుమారు రూ. 81 వేల విలువైన మందులను బహిరంగ మార్కెట్లో అమ్ముతున్న ఇద్దరిని డ్రగ్ కంట్రోల్ అధికారులు పట్టుకున్న ఘటనపై శుక్రవారం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) డాక్టర్ వాణి స్పందించారు. ఆమె ఆదేశాల మేరకు ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ విచారణ చేపట్టారు.
వారికి హాస్పిటల్ ఉద్యోగుల్లో ఎవరైనా సహకరించారా.. రోగులకు అందజేసిన మందుల రికార్డుల నమోదు ప్రక్రియలో ఏ విధానాన్ని అనుపరిస్తున్నారు.. ఎప్పటి వరకు నమోదు ప్రక్రియ పూర్తి చేశారు.. అనే అంశాలపై ఆరా తీశారు. ఓపీ ఫార్మాసిస్ట్ తలకోటి నాగేందర్, హైదరాబాద్కు చెందిన వ్యాపారి బలరాందాసుపై నమోదైన కేసు వివరాలు ఇంతెజార్గంజ్ పోలీస్స్టేషన్ నుంచి అధికారికంగా అందని కారణంగా అధికారులు చర్యల కోసం వేచిచూస్తున్నారు. ప్రాంతీయ నేత్ర వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ గిరిధర్ సెలవులో ఉన్నందున శాఖాపరమైన చర్యలు చేపట్టాలని నేత్ర వైద్యశాల ఇన్చార్జి సూపరింటెండెంట్ భరత్కుమార్కు ఎంజీఎం సూపరింటెండెంట్ సూచించారు.