కరీమాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సద్దుల బతుకమ్మ పండుగకు రాష్ట్రంలోని ఆడబిడ్డలకు పుట్టింటి చీరలను కానుకగా పంపిణీ చేయడం హర్షణీయమని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. సోమవారం కార్పొరేటర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో ఉర్సు సీఆర్సీ భవనంలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల బతుకులు బాగుండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమన్నారు. పండుగపూట ప్రతీ ఒక్కరూ సంతోషంగా ఉండాలని కేసీఆర్ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టారన్నారు.
తూర్పు నియోజకవర్గంలో దాదాపు లక్ష మందికి ఆడబిడ్డలకు పండుగపూట చీరల పంపిణీ అవకాశం అందించిన కేసీఆర్కు రుణపడి ఉంటానన్నారు. ఓ కొడుకుగా, అన్నగా, తమ్ముడిలా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారన్నారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇంత వరకు ఏ ప్రభుత్వం చేపట్టని సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. చేతి వృత్తులకు, కుల వృత్తులకు కేసీఆర్ బాసటగా నిలుస్తూ చేయూతను అందిస్తున్నారన్నారు.
చీరల పంపిణీతో చేనేతకు ఉపాధితో పాటు పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మరుపల్ల భాగ్యలక్ష్మి, బత్తిని వసుంధర, నాయకులు నొగిలిశెట్టి నిల్, గుడిమెల్ల రాజు, కోరె కృష్ణ, వనం కుమార్, బత్తిని అఖిల్, ఎలగొండ రవి, పెంచాల కృష్ణ, మిరియాల ఆదిత్య, ఆవునూరి రాంమూర్తి, వనం మధు, వరంగల్ మహానగరపాలక సంస్థ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.