మడికొండ, అక్టోబర్ 8 : విలీన గ్రామాలకు ప్రత్యేక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసినట్లు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ 45వ డివిజన్ పరిధిలోని కడిపికొండ, తరాలపల్లి, కుమ్మరిగూడె, రాంపేట, అయోధ్యపురం గ్రామాల్లో రూ.5.42కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆదివారం ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అలాగే, ఆయా గ్రామాల్లో బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామాల్లో బైక్పై ర్యాలీగా తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విలీన గ్రామాలు, కాలనీల అభివృద్ధికి అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కాకుండా, ప్రతి గడపకూ సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా పని చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్రావు, దర్గా సొసైటీ చైర్మన్ ఊకంటి వనంరెడ్డి, డివిజన్ అధ్యక్షుడు మేరుగు రమేశ్, డివిజన్ కోఆర్డినేటర్ బొమ్మినేని రాంచంద్రారెడ్డి, నాయకులు కర్ర హరీశ్రెడ్డి, శ్రీనివాస్, శాంతికుమార్, రవీందర్, యాదగిరి పాల్గొన్నారు.
వర్ధన్నపేట ప్రగతికి రూ.150 కోట్లు
వర్ధన్నపేట : గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయిన వర్ధన్నపేట అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.150 కోట్ల మేరకు ఖర్చు చేసిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ తెలిపారు. సోమవారం పట్టణంలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపన కార్యక్రమాలకు సోమవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ హాజరుకానున్నందున ఆదివారం సాయంత్రం పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో వర్ధన్నపేటను మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసుకున్నట్లు తెలిపారు. తొలుత పట్టణ అభివృద్ధి కోసం రూ.35 కోట్లను విడుదల చేసినప్పటికీ పట్టణంలో మరిన్ని అభివృద్ధి పనులు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులను కోరడంతో ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి సుమారు రూ.150 కోట్ల మేరకు విడుదలైనట్లు తెలిపారు.
ఈ నిధులతో పలు అభివృద్ధి పనులు పూర్తి చేయడంతో పాటుగా మరిన్ని పనులకు కూడా శంకుస్థాపనలు చేయనున్నట్లు చెప్పారు. ఇందులో ప్రధానంగా ప్రభుత్వ దవాఖానను 100 పడకల వైద్యశాలగా అప్గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు. అలాగే, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని కూడా ప్రభుత్వం మంజూరు చేసినట్లు చెప్పారు. ప్రధానంగా వర్ధన్నపేట అంబేద్కర్ సెంటర్ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఇందుకు సహకారం అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, ఎంపీపీ అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ అరుణ, వైస్చైర్మన్ ఎలేందర్రెడ్డి, కౌన్సిలర్లు ఉన్నారు.
నేడు పనులకు ప్రారంభోత్సవాలు
వర్ధన్నపేటలో ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపనలు జరుగనున్నాయి. నూతనంగా ఏర్పడిన వర్ధన్నపేట మున్సిపాలిటీలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేసింది. దీంతో ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో 100 పడకల దవాఖాన, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం, ఆర్టీసీ బస్టాండ్లో సీసీ నిర్మాణం, నూతనంగా సర్కిల్ నిర్మాణం, అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణతో పాటు దోబీఘాట్, సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ, రహదారి నిర్మాణం తదితర పనులు చేపట్టారు. అంతేకాకుండా పలు కమ్యూనిటీ భవనాలను కూడా మంజూరు చేయడంతో వాటికి శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ హాజరు కానున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు జరిగే ఈ కార్యక్రమాల అనంతరం సుమారు 3 వేల మందితో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమానికి అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తరలిరావాలని ఎమ్మెల్యే అరూరి మేశ్ కోరారు.