‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ నినాదంతో ఉద్యమ నేత కేసీఆర్ తలపెట్టిన మొక్కవోని దీక్షతోనే అరవై ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పేర్కొన్నారు. ఉద్యమ జ్ఞాపకాలను నెమరువేసుకునేందుకు, స్ఫూర్తిని రగిలించేందుకు పశ్చిమ నియోజకవర్గంలో 11 రోజుల కార్యాచరణతో తలపెట్టిన దీక్షా దివస్ను మంగళవారం హనుమకొండలోని కాళోజీ జంక్షన్లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దాస్యం మాట్లాడుతూ రాష్ట్ర సాధనకు బీజేపీ, కాంగ్రెస్ సహకరించకపోయినా గాంధేయ మార్గంలో కేసీఆర్ తెలంగాణ సాధించి.. అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారని చెప్పారు. చైతన్యానికి నెలవైన తెలంగాణలో మతోన్మాదుల ఆటలు సాగవని, విచ్ఛిన్నకర శక్తులతో అప్రమత్తంగా ఉండాలన్న ప్రముఖ రచయిత, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ తన పాటలతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.
హనుమకొండ, నవంబర్ 29 : ఆనాటి ఉద్యమ నేత, నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మొక్కవోని దీక్షతోనే 60ఏళ్ల తెలంగాణ రాష్ట్ర సాధన కల సాకారమైందని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సీఎం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి నేటితో 13 ఏళ్లయిన సందర్భంగా చీఫ్ విఫ్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాసర్ ఆధ్వర్యంలో హనుమకొండ కాళోజీ సెంటర్ వద్ద దీక్ష దివస్ కార్యక్రమం నిర్వహించారు. కారక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ రచయిత, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా దాస్యం మాట్లాడుతూ ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అనే నినాదంతో కేసీఆర్ 11రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి గాంధేయ మార్గంలో తెలంగాణ సాధించారని గుర్తుచేశారు. ఆనాడు కేసీఆర్ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమంలో తాను తెగించి పోరాడినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర సాధనకు ఆనాడు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎవరూ సహకరించేలేదన్నారు. ఉద్యమం సందర్భంగా అక్రమ అరెస్టులు, కేసులు పెట్టారన్నారు. గాంధేయ మార్గంలో సాధించిన తెలంగాణను అంబేద్కర్ ఆలోచనలతో ఆచరణ చేస్తూ సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈమేరకు ఉద్యమ జ్ఞాపకాలు, స్ఫూర్తిని చాటేందుకు మంగళవారం నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు దాస్యం తెలిపారు. ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలను నెమరువేసుకున్న ఆయన తన వెంట కార్యకర్తలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
విచ్ఛిన్నకారులతో అప్రమత్తంగా ఉండాలి : దేశపతి
విచ్ఛిన్నకారుల పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ రచయిత, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. 14 సంవత్సరాల పోరాటాన్ని సజీవంగా ఉంచేలా కేసీఆర్ ఎన్నో వ్యూహాలు రచించారన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రపంచాన్నే కదిలించిందన్నారు. ప్రపంచానికి దిశానిర్దేశం చేసిన తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా కీర్తిని చాటుకుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ పోరాట చరిత్రలో వరంగల్ అగ్రభాగాన ఉంటుందన్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా పోరాటాలను గుర్తు చేసుకొనేందుకు దీక్షా దివస్ అన్నారు. తెలంగాణ ఉద్యమం సబ్బండ వర్గాల్లో అద్భుతమైన చైతన్యాన్ని నింపిందని పేర్కొన్నారు. శాసించి తెలంగాణను సాధించామని యాచించి కాదన్నారు. కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి చెందుతున్న తెలంగాణను విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు పన్నుతున్న శక్తుల పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలన్నారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇప్పుడిప్పుడే ప్రగతిపథంలో పయనిస్తుంటే అది గిట్టని కేంద్రం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ అణచివేయ చూస్తున్నదని ఆయన విమర్శించారు. చైతన్యానికి నెలవైన తెలంగాణలో మతోన్మాదుల ఆటలు సాగవని దేశపతి హెచ్చరించారు. కేసీఆర్ ఆమరణ దీక్ష సబ్బండ వర్గాలను ఏకం చేసి ఉద్యమానికి ఊతమిచ్చిందన్న ఆయన తెలంగాణ పోరాటంలోనే కేసీఆర్ దీక్ష ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. ఓరుగల్లు కేంద్రంగా సీమాంధ్రుల కుట్రలకు వ్యతిరేకంగా శాసనసభ్యుడిగా పోరాడిన చరిత్ర దాస్యం వినయ్భాసర్కే దకుతుందన్నారు. ఉద్యమకాలంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ, కాకతీయ ఉత్సవాల సందర్భంగా నిరసనల రూపంలో ఆయన ప్రదర్శించిన ధైర్యసాహసాలు వెలకట్టలేనివని కొనియాడారు. ఉద్యమంలో ఓరుగల్లు కేసీఆర్ వెన్నంటి నడవడమే కాకుండా ఉద్యమరూపాలకు ఆయువు పోసిందన్నారు. ప్రజాకవి కాళోజీ, తెలంగాణ స్వాప్నికుడు జయశంకర్, దాశరథి, బమ్మెర పోతనలు జన్మించిన నేల ఓరుగల్లు అని పేర్కొన్నారు. కాకతీయుల శౌర్యం, సమ్మక-సారలమ్మల ధైర్యం ఓరుగల్లు సొంతమన్నారు. అలాంటి ఓరుగల్లు గడ్డ మీద మళ్లీ ఉద్యమ జ్ఞాపకాలను స్మరించుకోవడం అభినందనీయమన్నారు.
చరిత్రను వర్తమానంలో నెమరు వేసుకోకపోతే చరిత్రకు గమ్యం ఉండదని దేశపతి అన్నారు. తెలంగాణ ఎకడిది అన్నకాన్నుంచి శాసించి గాంధేయ మార్గంలో నేడు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుని అనేక సమస్యలను అనతికాలంలోనే పరిషరించుకున్నామని వివరించారు. వేలాది మంది అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీరు పారుతుంటే కొన్ని విచ్ఛిన్న మతతత్వ శక్తులు మళ్లీ రక్తం పారించాలని కుట్రలు చేస్తున్నాయని ఆ ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. బీజేపీ పాలనలో దేశంలో ఆర్థిక స్థితి రోజు రోజకు క్షీణిస్తున్నదన్నారు. కొందరు కరోనా సమయంలో కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టారని మండిపడ్డారు. మతం పేరుతో రెచ్చగొడుతూ విద్వేషాలను ప్రేరేపిస్తున్నారన్నారు. మత రాజకీయాలతో అధికారంలోకి రావాలని అనుకోవడం బీజేపీది దుర్మార్గమైన చర్య అన్నారు. అనంతరం తన పాటలతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తాళ్లపల్లి జనార్దన్గౌడ్, పులి రజినీకాంత్, పసునూటి విష్ణువర్దన్రెడ్డి, పలు డివిజన్ల కార్పొరేటర్లు, అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, కార్యవర్గ సభ్యులు, ముఖ్య కార్యకర్తలు, టీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులు తదితరులు, ప్రజలు పాల్గొన్నారు.
మన సంపదను కొల్లగొడుతున్నారు : ప్రొఫెసర్ పాపారావు
తెలంగాణ సంపదను కేంద్రంలోని బీజేపీ కొల్లగొడుతున్నదని ప్రముఖ ఆర్థిక నిపుణుడు, ప్రొఫెసర్ పాపారావు అన్నారు. తాను ఆంధ్రా ప్రాంతం వాడినైనప్పటికీ తెలంగాణ ఉద్యమానికి నైతిక మద్దతు తెలిపానన్నారు. నేడు తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడం ఎంతో గొప్ప విషయమన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం పలు ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తూ ప్రైవేటుకు కొమ్ము కాయడం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలను నిర్వీర్యం చేస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణలోని అమలు చేస్తున్న రైతుబంధు పథకాన్ని కాపీ చేసి పీఎం కిసాన్ సమ్మాన్ పథకాన్ని ప్రారంభించారన్నారు. గాంధేయ మార్గంలో సాగిన తెలంగాణ ఉద్యమం.. దేశానికి స్ఫూర్తిగా నిలిచిందన్నారు.