తాడ్వాయి, ఫిబ్రవరి 19 : వనదేవతల దర్శనానికి సోమవారం భక్తులు భారీగా తరలివచ్చారు. మొదట జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి తలనీలాలు సమర్పించారు. అక్కడి నుంచి గద్దెల వద్దకు చేరుకొని సమ్మక్క-సారలమ్మకు మొక్కులు చెల్లించారు. జాతర పరిసరాల్లో భక్తులు విడిది చేస్తుండడంతో సందడిగా మారుతోంది. కాగా, ఐదు లక్షల మంది భక్తులు మొక్కులు చెల్లించినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.
తల్లుల దర్శనంలో భక్తులు బిజీగా ఉంటే ఇదే అదనుగా జేబు దొంగలు తమ చేతివాటం చూపిస్తున్నారు. సోమవారం 27మంది పర్సులు, సెల్ ఫోన్లు, డబ్బులను కాజేశారు. గద్దెల వద్ద సీసీఎస్, పోలీస్ సిబ్బంది ఉన్నా భక్తుల ముసుగులో తమ పని కానిచ్చేస్తున్నారు. పోలీసులు అనుమానితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నా దొంగతనాలు మాత్రం ఆగడం లేదు.