వర్ధన్నపేట(రాయపర్తి), ఏప్రిల్ 23: రైతు సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రాయపర్తి మండలంలో ఆదివారం నిర్వహించిన పలు గ్రామాల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రతి ఎకరాకు సాగునీరందుతోందని తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గంలో 10వేల మంది మహిళలకు కుట్టుశిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా అవసరమైన రోడ్లను నిర్మించినట్లు తెలిపారు. పేదలకు సొంత ఇంటిస్థలం ఉంటే పక్కా గృహాన్ని నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ.3 లక్షలను మంజూరు చేస్తుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఆసరా పింఛన్లతో వృద్ధులకు కుటుంబంలో ఎంతో గౌరవం పెరిగిందని అన్నారు.
సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రాయపర్తి మండలంలోని కొత్తూరు, బంధన్పల్లి, ఏకేతండా, సూర్యాతండాల పరిధిలో ఉదయం, కొండూరు, కొలన్పల్లి, జయరామ్తండా, ఆరెగూడెం గ్రామాల పరిధిలో సాయంత్రం బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయసమ్మేళనాలను నిర్వహించారు. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ఎర్రబెల్లి ఉషాదయాకర్రావుతో కలిసి మంత్రి దయాకర్రావు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ సందేశాన్ని ఉషాదయాకర్రావు చదివి వినిపించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి 8 సంవత్సరాలుగా గ్రామాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇంకా చేపట్టాల్సిన పనులను ప్రజలకు సమగ్రంగా వివరించారు. ప్రధానంగా పంటలకు పూర్తిస్థాయిలో సాగునీటిని అందించేందుకు కృషి చేస్తున్నానని అన్నారు. కొత్తూరు, కొలన్పల్లి గ్రామాలకు సాగునీరు అందుతున్నా కొండూరు, కొలన్పల్లి గ్రామాలకు దేవాదుల ద్వారా నీరు అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అలాగే, ఇంకా గ్రామాల్లో త్వరలోనే అన్ని పనులను పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. గతంలో సాగునీరు, తాగునీటి కోసం రైతులు, మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. కానీ, సీఎం కేసీఆర్ కేవలం మూడేళ్లలో గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడంతో ప్రతి ఎకరాకు సాగునీరు అందుతున్నదని అన్నారు. దీనివల్ల రైతులు ఆర్థిక పరిస్థితి మెరుగు కావడంతో పాటుగా మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందుతుందని అన్నారు. దీంతో రైతులు, మహిళలు గ్రామాల్లో సంతోషంగా ఉన్నారని మంత్రి వివరించారు. అలాగే ఆత్మీయ సమ్మేళానికి హాజరైన ప్రజలకోసం తయారు చేసిన వంటకాలను మంత్రి దయాకర్రావు స్వయంగా పరిశీలించారు. పలువురికి స్వయంగా వడ్డించి భోజనం చేశారు.
10వేల మందికి కుట్టు శిక్షణ
పాలకుర్తి నియోజకవర్గంలో 10వేల మందికి కుట్టుశిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఇప్పటికే రెండు బ్యాచ్లకు శిక్షణ పూర్తి చేయడంతో పాటు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఉచితంగా కట్టు మిషన్లను అందించినట్లు వివరించారు. అంతేకాకుండా 10వ తరగతి పూర్తి చేసిన యువతులకు టెక్స్టైల్ పార్కులో ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తానని హామీ ఇచ్చారు. అలాగే, శిక్షణ పొందిన మహిళలు కూడా ఇంటి వద్దనే ఉపాధి పొందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. మహిళలతో పాటు గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని అన్నారు. గతంలో గుంతలమయంగా ఉండే రహదారులతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. కానీ, పంచాయతీరాజ్ శాఖ ద్వారా నియోజకవర్గంలో అవసరమైన అన్ని ప్రధాన రహదారులను నిర్మించినట్లు తెలిపారు. నూతన గ్రామ పంచాయతీలకు, మహిళా సమాఖ్య భవనాలను కూడా నిర్మిస్తున్నట్లు వివరించారు.
స్థలం ఉంటే రూ.3లక్షలు
ప్రభుత్వ స్థలాలు ఉన్న గ్రామాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి పేదలకు పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. కానీ, డబుల్ బెడ్రూం ఇండ్లకు ఎంపికకాని పేదలకు సొంత ఇంటిస్థలం ఉంటే పక్కా గృహాన్ని నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ.3 లక్షలను మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. త్వరలోనే ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనున్నందున దశల వారీగా గ్రామాల్లోని అర్హులకు పక్కాగృహాలు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఆసరా పింఛన్లతో వృద్ధులకు కుటుంబంలో ఎంతో గౌరవం పెరిగిందని అన్నారు. కుటుంబ సభ్యులు కూడా వృద్ధులు, దివ్యాంగులను ఆసరా పింఛన్లతో ఆదరిస్తున్నారని వివరించారు. అంతేకాకుండా కల్యాణలక్ష్మి పథకం కూడా పేద కుటుంబాలకు ఎంతో అండగా నిలుస్తున్నదన్నారు. రైతులకు రైతుబంధు, రైతుబీమా ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. రైతులు రైతుబంధు పథకాన్ని ఉపయోగించుకొని ఆర్థికంగా ప్రగతి సాధిస్తున్నారని వివరించారు. అలాగే ప్రజా అవసరాలను గుర్తించి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. కానీ, విపక్ష పార్టీల నాయకులు మాత్రం ప్రభుత్వంపై అర్థంలేని విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి వారిని రచ్చబండ వద్ద నిలదీయాలని పిలుపునిచ్చారు. అలాగే మీ ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచి కేసీఆర్ ఆశీస్సులతో మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఎక్కడ కూడా పొరపాట్లకు తావులేకుండా ప్రజా సేవ చేస్తున్నానని వివరించారు. సమ్మేళనాల్లో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహనాయక్, పార్టీ నాయకులు బిల్లా సుధీర్రెడ్డి, ఆకుల సురేందర్ తదితరులు పాల్గొన్నారు.