చెన్నారావుపేట, ఏప్రిల్ 2 ; ‘మన ఊరు-మన బడి’తో చెన్నారావుపేట మండలంలోని ఖాదర్పేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సరికొత్తగా మెరిసిపోతున్నది. పాఠశాల అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం రూ.11.20 లక్షలు మంజూరు చేసి బడి రూపురేఖల్ని మార్చివేసింది. ఈ నిధులతో అధునాతన తరగతి గదులు, పిల్లలకు సౌకర్యంగా ఉండేలా డ్యుయల్ డెస్క్ బెంచీలు, విద్యార్థుల్లో ఆసక్తిని పెంచేలా డిజిటల్ క్లాసులు, సులువుగా అర్థమయ్యేలా బోధనోపకరణాలు, ఆవరణలో ఆకర్షణీయమైన, ఆహ్లాదకర వాతావరణంలో పాఠాలు బోధిస్తున్నది. ఒకప్పుడు శిథిలావస్థలో ఉన్న సర్కారు బడిని నేడు కార్పొరేట్ స్థాయిలో సకల సదుపాయాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నది. ఇందులో భాగంగా చెన్నారావుపేట మండలంలోని ఖాదర్పేట గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆధునీకరణకు రూ.11.20 లక్షల నిధులు కేటాయించారు. వీటితో 12 రకాల పనులు చేపట్టి పాఠశాలను నూతన హంగులతో తీర్చిదిద్దారు. పాఠశాల తరగతి గదులకు తలుపులు, కిటికీలు, మేజర్, మైనర్ మరమ్మతులు పూర్తి చేసి ప్రతి గదిలో నాలుగు ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు అమర్చారు. అలాగే కొత్తగా వాటర్ ట్యాంక్ ఏర్పాటుచేసి తాగునీటి సౌకర్యం కల్పించారు. అధునాతన పద్ధతిలో విలాసవంతమైన టాయిలెట్ రూములను నిర్మించారు. పాఠశాలలో ప్రత్యేకంగా విద్యార్థులను ఆకట్టుకునేలా రకరకాల జంతువులు, పక్షుల చిత్రాలు వేయించారు.
విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేలా డ్యుయల్ డెస్క్ బెంచీలను సమకూర్చారు. పాఠశాల ఆవరణ అంతటా బండలు పరిచి విద్యార్థులు ఆడుకునేందుకు వీలుగా మార్చారు. అలాగే విద్యా నైపుణ్యాలు, పఠన సామర్థ్యం పెంపొందించేందుకు తొలిమెట్టులో భాగంగా టీచింగ్ లర్నింగ్ మెథడ్ ద్వారా బోధనోపకరణాలతో విద్యార్థులకు సులభంగా విద్యనందిస్తున్నారు. హ్యాండ్ రైటింగ్ స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇంగ్లిష్ భాషపై పట్టుసాధించేందుకు సుశిక్షితులైన ఉపాధ్యాయులతో విద్యార్థులకు ప్రత్యేక డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మానసికోల్లాసం కోసం విద్యార్థులకు ఆటలు ఆడిస్తూ ఉత్సాహం నింపుతున్నారు. పాఠశాలలో ప్రస్తుతం 70మంది విద్యార్థులుండగా సకల సౌకర్యాలు ఆహ్లాదకరమైన వాతావరణం నడుమ ఉల్లాసంగా చదువుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో పాఠశాలకు మహర్దశ రావడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులు ఉత్సాహంగా విద్యాబోధన చేస్తూ విద్యార్థులను అన్నింటా ప్రోత్సహిస్తున్నారు.
సకల సౌకర్యాలతో బాగుంది..
రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’లో ఖాదర్పేట పాఠశాలను మొదటి దశలోనే ఎంపిక చేసి పనులు పూర్తికావడం చాలా సంతోషంగా ఉంది. చిన్న పాఠశాల అయినప్పటికీ విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాం. ఇంగ్లిష్ మీడియంలో పాఠాలు బోధించడం వల్ల గ్రామంలోని పిల్లలందరూ ఈ స్కూల్కే వస్తున్నారు.
– అనుముల కుమారస్వామి, సర్పంచ్
ప్రైవేట్కు దీటుగా..
ఒకప్పుడు విద్యార్థులు లేరని సర్కారు బడులను మూసి వేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ‘మన ఊరు-మన బడి’ ద్వారా పాఠశాలలను అన్ని రకాలాగా అభివృద్ధి చేసి సకల సౌకర్యాలు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ పాఠశాలకు దీటుగా తీర్చిదిద్దారు. ఇంగ్లిష్ మీడియం పాఠాలు బోధించడం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ పాఠశాలకే పంపిస్తున్నారు.
– కట్టస్వామి, పాఠశాల హెచ్ఎం