తెలంగాణ దశాబ్ది ఉత్సవం అంబరాన్నంటింది. శుక్రవారం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు పండుగ వాతావరణంలో ప్రారంభం కాగా ఊరూవాడన సంబురం నెలకొంది. వరంగల్, హనుమకొండ జిల్లా కేంద్రాల్లో ఏర్పాటుచేసిన ఉత్సవాలకు మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, చీఫ్విప్ దాస్యం ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆటాపాటలతో కళాకారులు, విద్యార్థులు దుమ్మురేపారు. అమరుల త్యాగాలను గుర్తుచేసుకొని స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సీఎం కప్ పోటీల్లో రాష్ట్రస్థాయిలో ప్రతిభచూపిన క్రీడాకారులతో పాటు జిల్లాలో ఉత్తమ సేవలందించిన వారికి బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 2
రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ పదేళ్ల వైభవం అంబరాన్నంటేలా ఊరూవాడన వేడుకలు జరిగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ఆవిర్భావ పండుగ ఘనంగా మొదలుకాగా జాతీయ జెండా ఆవిష్కరణలు, కళాకారులు, చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలతో హోరెత్తింది. ఈ సందర్భంగా అన్ని జిల్లాల సమీకృత కలెక్టరేట్ల వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులు పాల్గొని త్రివర్ణ పతాకాలను ఎగరేసి తెలంగాణ ప్రగతి నివేదికను వివరించారు. జనగామలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మహబూబాబాద్లో గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్, హనుమకొండలో చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, జయశంకర్ భూపాలపల్లిలో ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, ములుగులో మండలి విప్ ఎంఎస్ ప్రభాకర్రావు, వరంగల్లో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్లు ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ అమరుల స్తూపం వద్ద నివాళులర్పించి, వారి కుటుంబాలను సన్మానించారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 2