బయ్యారం/శాయంపేట, జనవరి 1: నిన్నామొన్నటి వరకు కోడి ధర చుక్కలు చూపించగా, ఇప్పుడు కోడిగుడ్డ మస్తు పిరమైంది. కానీ, కొద్దిరోజుల నుంచి గుడ్డు ధర చుక్కలు చూపిస్తున్నది. ధర పెరగడంతో సామాన్యులు తినడానికి ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. మూడు నెలల కిందట కోడి గుడ్ల కేసు (30 కోడిగుడ్లు) రూ.120 నుంచి రూ.130 మాత్రమే ఉండేది. దీంతో రిటైల్ మార్కెట్లో రూ.5లకే గుడ్డు అమ్మేవారు. కానీ, కొన్ని రోజులుగా గుడ్ల ధర పెరుగుతూ వస్తున్నది. 15 రోజుల క్రితం కేసు ధర రూ.160 ఉండగా, రిటైల్ మార్కెట్లో రూ.6కు విక్రయించారు.
ప్రస్తుతం కేసు ధర రూ.180 నుంచి రూ.200 చేరడంతో రిటైల్ మార్కెట్లో రూ.7 నుంచి రూ.8 వరకు అమ్ముతున్నారు. ధర ఎక్కువగా ఉండడంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. కాగా, చలికాలం కావడంతో గుడ్ల ఉత్పత్తి తగ్గిందని, మామూలు రోజులతో పోలిస్తే చలికాలంలో గుడ్ల ఉత్పత్తి 60 శాతం నుంచి 70 శాతానికి పడిపోతుందని కోళ్ల ఫాం యజమానులు చెబుతున్నారు. అంతేకాకుండా ఎండాకాలంతో పోలిస్తే చలి, వానకాలాల్లో గుడ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం ఉండడంతో యజమానులు ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేసేందుకు ఆసక్తి చూపడం తదితర కారణాలతో గుడ్ల ధర పిరమైందని వ్యాపారులు చెబుతున్నారు.