‘నా భర్త తెలంగాణ కోసం బలిదానం చేసుకున్నడు. అప్పుడు నా పెద్ద బిడ్డ ఏడాదిన్నర, చిన్న బిడ్డ ఆరు నెలల పసిగుడ్డు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయి నా బిడ్డల పరిస్థితి ఎట్ల అని గుండెలు బాదుకున్న.. నా బిడ్డలను పట్టుకొని మా అమ్మ, తమ్ముడితో ఉన్నా. నా భర్త త్యాగాన్ని గుర్తుంచుకున్న కేసీఆర్ సారు తెలంగాణ వచ్చినంక రూ.10 లక్షల సాయం అందించిండు. వాటిలో రూ.4లక్షల చొప్పున ఇద్దరు బిడ్డల పేర్ల మీద ఫిక్స్ చేసిన. నాకు ప్రభుత్వం ఇచ్చిన నౌకరీ పెద్ద దిక్కయింది..’ అంటూ వివరించింది అమరుడు దాసారపు శ్రీనివాస్ భార్య రజిత.
ములుగు, జూన్ 24 (నమస్తేతెలంగాణ) : మలిదశ తెలంగాణ ఉద్యమంలో ములుగు జిల్లా ములుగు మండలం అబ్బాపురం శివారు కుమ్మరిపల్లికి చెందిన ఉద్యమకారుడు దాసారపు శ్రీనివాస్ తన వంతు పాత్ర పోషించాడు. ఆంధ్రా పాలకుల కుట్రలతో తెలంగాణ ఉద్యమం సన్నగిల్లుతుందనే భయంతో తీవ్ర మనస్తాపం చెంది తన చావుతోనైనా తెలంగాణ రావాలని 2011 ఫిబ్రవరి 11న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి కుటుంబానికి తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అండగా నిలిచారు. శ్రీనివాస్ భార్య రజితకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించి, ఆ కుటుంబానికి రూ.10లక్షలు సాయం అందించగా శ్రీనివాస్ భార్య, ఇద్దరు బిడ్డలకు పెద్ద దిక్కుగా మారాయి. ప్రస్తుతం రజిత హనుమకొండ జిల్లాలోని మామునూరు పోలీస్ క్యాంపులో స్వీపర్గా పనిచేస్తూ క్యాంపు శివారులోని పింఛన్పురంలో ఇద్దరు బిడ్డలతో కలిసి నివాసముంటున్నది. ఇద్దరు బిడ్డల్లో పెద్ద కుమార్తె అంజలి ములుగు జిల్లా కేంద్రంలోని మాధవ రావుపల్లి కస్తూర్బా పాఠశాలలో 10వ తరగతి, చిన్న కుమార్తె అంకిత హనుమకొండలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. ‘నమస్తే తెలంగాణ’ వారి స్థితి గతులను తెలుసుకునేందుకు కలువగా నాటి తన భర్త త్యాగం, నేటి తెలంగాణ అభివృద్ధిపై రజిత పలు విషయాలను తెలియజేసింది.
నా భర్త బతికున్నన్ని రోజులు తెలంగాణ రావాలనే కొట్లాడేటోడు. ఎక్కడ ధర్నాలు, ర్యాలీలు జరిగినా గులాబీ జెండా పట్టుకొని జై తెలంగాణ అనుకుంట పోయేటోడు. రోజు లెక్కనే పోయి ఇంటికి వస్తడు అనుకున్న నా భర్త ఆ రోజు తిరిగి రాలేదు. తెలంగాణ వస్తెనే బిడ్డల బతుకులు బాగుపడుయని పురుగుల మందు తాగి ఆత్మబలిదానం చేసుకున్నడు. అప్పుడు మా పెద్ద బిడ్డ అంజలి ఏడాదిన్నర, చిన్న బిడ్డ ఆరు నెలల పసిగుడ్డు. సమయంల కొందరు ఉద్యమకారులు వచ్చి బియ్యం, కొన్ని పైసలు ఇచ్చిండ్రు. ఆ తర్వాత నా బిడ్డల పరిస్థితి, నా పరిస్థితి ఎట్లా అని నేను రోజూ కుమిలిపోయేదాన్ని.
అప్పుడు ఎంపీడీవో ఆఫీసు నుండి కొంత మంది సార్లు వచ్చి రూ.5వేలు ఇచ్చిన్రు. నా బిడ్డలను పట్టుకొని మా అమ్మ, తమ్ముడితో ఉన్నా. 2014ల తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ సారు మాకు రూ.10 లక్షల సాయం అందించిండు. ఆ సాయం ఎప్పటికీ మరిచిపోను. ఆ పైసల్లో రూ.4లక్షల చొప్పున ఇద్దరు బిడ్డల పేర్ల మీద ములుగు ఎస్బీఐ బ్యాంకులో ఫిక్స్ చేసిన. రూ. లక్ష పెట్టి కుమ్మరిపల్లిలో గుంటన్నర ఇల్లడుగు జాగ కొన్న. మిగిలిన మరో లక్ష ఖర్చులకు వాడుకున్న. అమరుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇస్తానని మాట ఇచ్చిన కేసీఆర్ సారు, అన్నట్లుగానే నాకు 2016లో మామునూరు పోలీస్ క్యాంపులో స్వీపర్ ఉద్యోగాన్నిచ్చిండు. నేను ఏమీ చదువుకోకున్నా ఈ ఉద్యోగం రావడం చాలా గొప్ప అనుకుంటా ఇప్పటికి. ఉద్యోగంలో చేరిన నాడు జీతం నెలకు రూ.13వేలు ఉండె. ఇప్పుడు రూ.20వేలు అయింది.
ఈ పైసలతో రంది లేకుండా బతుకుతున్నం. పిల్లలను చదివిస్తూ ఉన్నంతల ఎల్లదీసుకుంటున్న. భర్త తోడు లేక ఇద్దరు బిడ్డలతో ఉన్న నాకు ఈ ఉద్యోగం తలెత్తుకొని బతికేలా చేసింది. ఎవరి దగ్గరా రూపాయి కోసం చేయి చాచి ఇప్పటి వరకు అడుగలే. ఈ సాయం రాకుంటే నాకు, నా బిడ్డలకు దిక్కులేకుండా ఉండేది. తెలంగాణల 9 సంవత్సరాలుగా వస్తున్న మార్పులు, అభివృద్ధిని మా సార్లు చెబుతుంటే విన్నప్పుడల్లా నా భర్త త్యాగం గుర్తుకు వస్తుంది. ఇప్పటికీ నేను ఒకటే అనుకుంటా నా భర్త త్యాగం వృథా కాలేదని. రేపు నా బిడ్డలు మంచిగ చదువుకుంటే తెలంగాణలో మంచి ఉద్యోగం సంపాదిస్తారనే నమ్మకం వచ్చింది. సీఎం కేసీఆర్ సార్కు నేను, నా బిడ్డలు రుణపడి ఉంటం. 2018లో నా భర్త త్యాగం గురించి ‘నమస్తే తెలంగాణ’లో మంచిగ రాసిండ్రు. ఆ వార్తను భద్రంగా దాచుకున్న. నా బిడ్డలకు, నాకు తెలిసిన వారికి నా భర్త తెలంగాణ కోసం చేసిన త్యాగాన్ని చూపిస్తూ ఉంటా.