పది మంది లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీ
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామన్న లబ్ధిదారులు
తెలంగాణ ప్రజల సంరక్షకుడు సీఎం
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
దళితబంధుతో అభివృద్ధి చెందాలి : గండ్ర జ్యోతి
శాయంపేట మండల కేంద్రంలో శనివారం దళితబంధు యూనిట్ల పంపిణీ పండుగలా జరిగింది. పది మంది లబ్ధిదారులకు మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో దళితబంధు యూనిట్లను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గండ్ర జ్యోతి పంపిణీ చేశారు. ట్రాక్టర్లు, కార్లు అందుకున్న లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరిసింది. తమకు అందించిన యూనిట్లను సద్వినియోగం చేసుకుంటామని, దళితుల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.
శాయంపేట, మే 28: మండల కేంద్రంలో శనివారం ‘దళితబంధు’ యూనిట్ల పంపిణీ పండుగ జరిగింది. ఎమ్మెల్యే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవీలత పది మంది లబ్ధిదారులకు ట్రాక్టర్లు, కార్లు అందించారు. ఈ సందర్భంగా ఎంపీపీ తిరుపతిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ తెలంగాణ ప్రజల సంరక్షకుడు, తెలంగాణ హక్కులను కాపాడే ఏకైక నాయకుడు సీఎం కేసీఆరే అన్నారు. సీఎం కేసీఆర్ దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో దళితులందరికీ యూనిట్లు అందుతాయని తెలిపారు.
యూనిట్లు పొందినవారు వాటితో అభివృద్ధి చెందాలని సూచించారు. శాయంపేటలో రోడ్డు విస్తరణలో ఇండ్లు పోతున్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేసేందుకు ప్రొసీడింగ్స్ ఇవ్వాలని ఎమ్మెల్యే సభావేదికపై అదనపు కలెక్టర్ సంధ్యారాణిని కోరారు. జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ రాష్ట్రంలోని దళితుల జీవితాల్లో సీఎం కేసీఆర్ పండుగ తెచ్చారని చెప్పారు. గ్రామాలకు అన్నీ సమకూర్చిన గొప్పనేత కేసీఆర్ అన్నారు. దళితబంధు యూనిట్లను సద్వినియోగం చేసుకొని ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవీలత మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఆమంచ కృష్ణమూర్తి, తహసీల్దార్ రాజు, పీఏసీఎస్ చైర్మన్ శరత్, ఏఎంసీ వైస్ చైర్మన్ మారెపల్లి నందం, సర్పంచ్లు కందగట్ల రవి, చిట్టిరెడ్డి రాజిరెడ్డి, అబ్బు ప్రకాశ్రెడ్డి, ఎంపీటీసీలు వావిలాల వేణుగోపాల్, గొట్టిముక్కల స్వాతి, మాచర్ల మంగమ్మ పాల్గొన్నారు.
అభివృద్ధి సాధిస్తా..
దళితబంధు కింద ట్రాక్టర్ తీసుకున్నాను. దీంతో ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తా. దళితబంధుతో సీఎంకేసీఆర్ లాంటి పేదలకు ఒకేసారి రూ.10లక్షల యూనిట్ ఇవ్వడం జీవితంలో పెద్ద మార్పు. ఎన్పీడీసీఎల్లో కాంట్రాక్టు లైసెన్స్ ఉంది. కాంట్రాక్టుకు ఉపయోగించుకుంటాను.
– కుమ్మరి కుమారస్వామి, లబ్ధిదారుడు, కొప్పుల
సీఎంను మరిచిపోను
దళితబంధు కింద నేను కారు తీసుకున్నా. నాకు గుంట భూమి లేదు. యూనిట్ అందించినందుకు సీఎం కేసీఆర్ను ఎన్నటికీ మరిచిపోను.
– దైనంపెల్లి సుమన్, లబ్ధిదారుడు, శాయంపేట