మహబూబాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకూ అమాంతం పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం కూరగాయలతోపాటు ఉప్పు, పప్పుల ధరలు మండిపోతున్నాయి. మొన్నటివరకు ఆకాశాన్నంటిన ఉల్లి ధరలు ఇప్పుడిప్పుడే నేలకు దిగి వస్తున్నాయి. తాజాగా వెల్లుల్లి ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. సంక్రాంతి పండుగ ముందు వరకు కిలోకు రూ.180 నుంచి రూ.240 వరకు ఉండగా, ఇప్పుడు ఒక్కసారిగా కిలో వెల్లుల్లి ధరలు రూ.360 నుంచి రూ.400 వరకు పెరిగింది. మూడు రకాల వెల్లుల్లి మార్కెట్లో ఉంది. చిన్నగా ఉన్నవి కిలోకు రూ.360, మీడియం సైజు రూ.380, పెద్దవి రూ.400 పలుకుతున్నాయి. పెరిగిన వెల్లుల్లి ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందిగా మారింది. వెజ్, నాన్వెజ్ కూరల్లో వెల్లుల్లి వేస్తేనే టేస్ట్గా ఉంటుంది. కర్రీ ఏదైనా వెల్లుల్లి తప్పకుండా వేయాల్సిందే. కానీ ఇప్పుడు కూర వండేప్పుడు దాన్ని వేయాలంటేనే జనం జంకుతున్నారు.
వెల్లుల్లి మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాకు దిగుమతి అవుతుంది. వరంగల్ నగరంతోపాటు జనగామ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లా కేంద్రాలకు సరఫరా అవుతుంది. అక్కడ గత నెలలో కురిసిన భారీ వర్షాలకు పంట బాగా దెబ్బతిన్నది. అక్కడి రైతులు తుపాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటను తొలగించి కొత్తగా మళ్లీ పంట వేశారు. దీంతో గడ్డ చేతికి వచ్చేసరికి సమయం పట్టనుంది. పాత వెల్లుల్లి నిల్వలు అయిపోవడంతో ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న కొత్త గడ్డకు ధర రూ.400 వరకు పలుకుతోందంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతోంది. సంక్రాంతి పండుగ ముందు నుంచే వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరిగాయని మానుకోట ఎల్లిగడ్డ హోల్సేల్ వ్యాపారి జనార్దన్ తెలిపారు. ధర ఒక్కసారిగా రెండింతలు పెరగడంతో ప్రజలు తక్కువగా కొంటున్నారని చెబుతున్నారు.