బుగులోని భక్తజన సంద్రమైంది. ఆపద మొక్కులు తీర్చే వేంకటేశ్వరుడి జాతరకు బుధవారం వేలాది మంది భక్తులు తరలిరాగా గోవింద నామస్మరణతో పాండవుల గుట్టలు మార్మోగాయి. చిన్నాపెద్ద వయోభేదం లేకుండా ఎత్తైన గుట్టలపైకి చేరుకొని చల్లగా చూడాలని మనసారా వేడుకొని మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో మేకలు, ఏనుగు ఆకారపు ప్రభబండ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జాతరలో భాగంగా స్వామివారిని ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి దర్శించుకొని జాతర అభివృద్ధికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
రేగొండ, నవంబర్ 9 : ఆపద మొక్కులు తీర్చే బుగులోని శ్రీవేంకటేశ్వరస్వామి జాతరకు బుధవారం భక్తజనం పోటెత్తింది. అశేష భక్తజనుల నడుమ గుట్టలు గోవింద నామస్మరణతో మర్మోగాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి శివారు పాండవుల గుట్టలపై ఏటా కార్తీక పౌర్ణమి రోజు నుంచి మొదలై మూడు రోజల పాటు జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతాయి. మూడో రోజైన బుధవారం ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామి వారిని దర్శించుకునేందుకు చిన్న పిల్లల నుంచి వయోవృద్ధుల దాకా అందరూ గోవింద నామస్మరణ చేస్తూ ఎతైన కొండలపై చేరుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
రేగొండ, ములుగు చుట్టుపక్క గ్రామాల నుంచి ఎడ్లబండ్లు, ప్రైవేట్ వాహనాల్లో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. జాతరలో ఏనుగు ఆకారం, మేకల ప్రభబండ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇలా తయారుచేసిన ప్రభ వాహనాలను బ్యాండు, వాయిద్యాల నడుమ గుట్ట కింద ఉన్న ఇప్పచెట్టు చుట్టూ తిప్పారు. జాతరలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. తాగునీరు, విద్యుత్, వంటి సౌకర్యాలతో జాతర ఆవరణలో దుమ్ము లేవకుండా ట్యాంకర్లతో నీళ్లు చల్లించారు. హెల్ప్లైన్ సెంటర్ ఏర్పాటు చేశారు. రేగొండ వైద్యాధికారి కోడూరి మమతాదేవి ఆధ్వర్యంలో వైద్య శిబిరంతో పాటు ప్రత్యేక అంబులెన్స్ అందుబాటులో ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ పులి వెంకట్, ఎస్సై నునిగంటి శ్రీకాంత్రెడ్డి భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. భక్తులకు ఎలాంటి సమస్యలు తతెత్తకుండా ఆలయ చైర్మన్ కడారి జనార్దన్, ఈవో బిళ్లు శ్రీనివాస్, సర్పంచ్ కట్లు రాణి, ధర్మకర్తలు అముల సదయ్య పర్యవేక్షించారు.
జాతర అభివృద్ధికి కృషిచేస్తా : ఎమ్మెల్సీ సిరికొండ
సీఎం కేసీఆర్ ఆశీస్సులతో బుగులోని వేంకటేశ్వరస్వామి జాతరను మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. జాతరలో భాగంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. రానున్న రోజుల్లో జాతరను రెండో తిరుపతిగా అభివృద్ధి చేస్తాన్నారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకులు గోపు భిక్షపతి, ఈర్ల సదానందం, కత్తి సంపత్, సూర నర్సింగరావు, వావిలాల రమేశ్, నడిపెల్లి వెంకట్రావు, యాపశేటి సాంబయ్య, సూర వేణు ఉన్నారు.