మహబూబాబాద్ రూరల్, మార్చి 19 : సరెండర్ కమ్ రిహాబిలిటేషన్ పాలసీలో భాగంగా సీపీఐ మావోయిస్టు పార్టీ సభ్యురాలు షేక్ చాంద్బీ(జ్యోతక్క) మంగళవారం మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఎదుట లొంగిపోయారు. షేక్ చాంద్బీ తొర్రూరు మండలంలో హరిపిరాలలో జన్మించింది. మూడేళ్ల వయసులో ఖానాపూర్ మండలం మనబోతుల గడ్డ గ్రామానికి ఆమె మేనత్త షేక్ ఇమాంబీ చాంద్బీని తీసుకువెళ్లారు.
నర్సంపేట ఏరియాలో కొంత కాలం ఉంది. అక్కడే మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నది. అనంతరం 2004లో ఛత్తీస్గఢ్ సీపీఐ మావోయిస్టు పార్టీ టైలరింగ్ టీమ్లో పనిచేసింది. మావోయిస్టు భావజాలంతో విసుగు చెందడంతోపాటు పార్టీ నాయకులు తమ స్వార్థం కోసం అమాయక ప్రజలను బలి చేస్తున్నారని వాస్తవాలను గ్రహించి జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకొని ఎస్పీ ఎదుట లొంగిపోయారు.