సుబేదారి, ఆగస్టు 22 : రౌడీషీటర్లపై నిత్యం నిఘా పెట్టాలని పోలీసు కమిషనర్ ఎన్ శ్వేత స్టేషన్ల అధికారులను ఆదేశించారు. హనుమకొండలోని కమిషనరేట్ కార్యాలయంలో శనివారం పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకోసం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్ల కదలికలపై నిఘా పెట్టాలన్నారు. నేరం జరుగకముందే అలర్ట్గా ఉండి, నేరాల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
మత్తు పదార్థాల నియంత్రణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని, విక్రయదారులు సమాచారం తెలుసుకోవాలని సూచించారు. సైబర్ నేరాల నియంత్రణకు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. పెండింగ్ కేసుల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా త్వరగా దర్యాప్తు చేసి, నేరస్తులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డీసీపీలు అంకిత్కుమార్, కవిత, రాజమహేంద్రనాయక్, కిషన్ సింగ్, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.