దూదిపూలు రైతుల ఇంట సిరులు కురిపిస్తున్నాయి. చరిత్రలో ఎన్న డూ లేనంతగా ఈసారి రికార్డు స్థాయిలో ధర పెరుగుతోంది. ఆసియా లోనే అతిపెద్ద ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో అత్యధికంగా క్వింటా పత్తి ధర రూ.8805 పలికింది. ఈ ఏడాది అధిక వర్షాలతో భూములు జాలువారి పూత, కాత రాలిపోయింది. కనీసం పెట్టుబడి కూడా వస్తుందో? రాదో? అని ఆందోళన చెందిన రైతులు రికార్డు స్థాయిలో ధర పలుకుతుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం క్వింటా పత్తికి రూ.6025 మద్దతు ధర నిర్ణయిం చింది. అయితే, అంతర్జాతీయంగా సాగు విస్తీర్ణం తగ్గడంతో పత్తికి డిమాండ్ ఏర్పడింది. దీనికి తోడు మన పత్తి నాణ్యంగా ఉండడంతో ఎంత ధరైనా పెట్టి కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకొస్తు న్నారు. దీంతో మార్కెట్ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో రోజు రోజు కూ పత్తి ధర పెరుగుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్, డిసెంబర్ 30 (నమస్తేతెలంగాణ) : పత్తి ధర పరుగు పెడుతున్నది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ చరిత్రలోనే ఆల్టైం రికార్డు సృష్టించింది. మునుపెన్నడూ లేని విధంగా గురువారం క్వింటా పత్తికి రూ.8,805 ధర పలికింది. ఆసియాలోని అతి పెద్ద మార్కెట్ అయిన ఎనుమాముల చరిత్రలో పత్తికి ఇంత ధర పలకడం ఇదే ఫస్ట్. కొద్ది రోజులుగా పత్తి ధర పైపైకి పోతుండటంతో రైతులు సంబుర పడుతున్నారు. భారీ వర్షాలతో పంట దిగుబడి కొంత తగ్గినప్పటికీ ధర కలిసొస్తుండడంతో మురిసిపోతున్నారు. సీఎం కేసీఆర్ చెప్పినట్టు పత్తి పంట సాగు చేసి లాభాలు పొందుతున్నామని సంతోషం వెలిబుచ్చుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో కూడా మన పత్తికి మంచి డిమాండ్ ఉన్నట్లు చెప్పడంతో రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. పత్తికి ప్రభుత్వ ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్కు రూ.6,025 కాగా, దీనిని మించి ధర పలుకుతోంది. ఈ ఏడాది ఆరంభం నుంచి మార్కెట్లో పత్తికి మంచి ధర పలుకుతుండటం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ ఒకటి నుంచి పత్తి ధరలను పరిశీలిస్తే గరిష్ఠ ధర క్వింటాల్కు రూ.7,600 తగ్గలేదు. నవంబర్ 2న క్వింటాకు గరిష్ఠ ధర రూ.8,570 పలికింది. అప్పటి వరకు ఎనుమాముల మార్కెట్ చరిత్రలో ఇదే రికార్డు ధర.
ప్రతిరోజు పైపైకి
కొద్ది రోజులుగా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర పైపైకి పోతోంది. ఈ నెలలో క్వింటా పత్తి గరిష్ఠ ధర రూ.7,700 తగ్గలేదు. 13న రూ.7,950 పలికి 14న రూ.8,080కి ఎగబాకింది. ఆ రోజు నుంచి పత్తి ధర రూ.8వేలకు తగ్గకపోగా రోజురోజుకూ పెరుగుతున్నది. 15న రూ.8,025 ఉంటే 16న రూ.8,060కి చేరింది. తెల్లవారి రూ.8,120 పలికింది. 20న రూ.8,250కి చేరింది. 21న రూ.8,180, 22న రూ.8,200కు పెరిగింది. 23న రూ.8,230, 24న రూ.8,280 పలికింది. 27వ తేదీ నుంచి పత్తి ధర మరింత పరుగులు పెడుతున్నది. 27న రూ.8,515 పలుకగా, 28న అదనంగా రూ.200 పెరగటంతో రూ.8,715కి ఎగబాకింది. 29న ఈ ధర రూ.8,800కి చేరింది. గురువారం రూ.8,805 పలికింది. ఎనుమాముల మార్కెట్ చరిత్రలోనే ఇంత ధర పలకడం ఆల్టైం రికార్డుగా మార్కెట్వర్గాలు తెలిపాయి. గురువారం మార్కెట్కు 9,341 బస్తాల ద్వారా 5,497 క్వింటాళ్ల పత్తి రాగా, మార్కెట్ వ్యాపారులు 4,670, జిన్నింగ్ మిల్లుల నిర్వాహకులు 827 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. ఈ ఏడాది మార్కెట్కు 3,67,332 క్వింటాళ్ల పత్తి వచ్చినట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి రాహుల్ తెలిపారు.
ఇప్పటి వరకు ఇంత ధర రాలేదు
మూడున్నరెకరాల్లో పత్తి సాగు చేసిన. కొద్ది రోజుల కింద ట ఐదారు కింటాళ్లు ఇక్కడనే అమ్మిన. ఇవాళ్ల మరో ఇరవై క్వింటాళ్ల పత్తి తెచ్చిన. ధర రూ. 8,700 పెట్టిల్లు. పత్తికి ఇంత ధర పెట్టడం ఇప్పటి వరకు చూడలేదు. వానలతో పత్తి పంట దెబ్బతిన్నది. అయినా, రేటు ఎక్కువ ఉండడం ఆనందంగా ఉన్నది.
ఆల్టైమ్ రికార్డు ధర
ఈ రోజు పత్తి క్వింటాల్ ధర రూ.8,805. ఈ ధర గతంలో ఎప్పుడూ లేదు. ఎనుమాముల మార్కెట్లో ఆల్టైమ్ రికార్డు ధర పలికింది. రైతుల్లో ఆనందం కనపడుతుంది. వానలకు దిగు బడి తగ్గినా మంచి ధర రావడంతో రైతులకు లాభం జరిగింది. వాళ్ల కష్టానికి తగిన ఫలితం దక్కింది.