తాడ్వాయి, జనవరి 6 : సమ్మక్క-సారలమ్మల దర్శనానికి వచ్చే భక్తులు సమర్పించే బంగారం(బెల్లం) నేరుగా తల్లుల చెంతకు చేరేలా దేవాదాయశాఖ అధికారులు కన్వేయర్ బెల్టు ఏర్పాటు చేయనున్నారు. ప్రధాన గేట్ వద్ద ఏర్పాటు చేసే బెల్ట్పై భక్తులు బెల్లం బుట్టలను పెడితే అది నేరుగా తల్లుల గద్దెలపైకి చేరుతుంది. గతంలో భక్తులు ఇష్టమొచ్చినట్లు బెల్లం విసరడంతో గద్దెలపై పేరుకుపోయేది. దానిని శుభ్రం చేయించడం అధికారులకు ఇబ్బందిగా మారేది. అంతేకాకుండా బెల్లం కరిగి భక్తుల కాళ్లకు అంటుకొని జాతర పరిసరాలు మొత్తం వ్యాపించేది. దీంతో ఈగల బెడద పెరుగుడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేది. ఈ సమస్యను అధిగమించేందుకు అధికారులు సుమారు రూ.80లక్షలతో సమ్మక్క గద్దెకి బెల్ట్ ద్వారా బెల్లం చేరేలా చర్యలు చేపట్టారు. ఇది సక్సెస్ అయితే వచ్చే జాతరకు సారలమ్మ గద్దె వద్దకు బెల్లం చేర్చేందుకు, గద్దెలపై పోగైన బెల్లాన్ని బయటకు తరలించేందుకు కన్వేయర్ బెల్టులను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయనున్నారు. ఈమేరకు శనివారం ఓ సంస్థకు చెందిన ఇంజినీరింగ్ అధికారులు సాధ్యాసాధ్యాలపై దేవాదాయశాఖ అధికారులు డీసీ శ్రీకాంత్రావు, ఏసీ సునీత, ఈవో రాజేంద్రం, ఈఈ దుర్గాప్రసాద్, డీఈ రమేశ్బాబుతో చర్చించారు. శనివారం మేడారం పర్యటనకు వచ్చిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క, కలెక్టర్ ఇలా త్రిపాఠి, అడిషనల్ కలెక్టర్ శ్రీజ, ఎస్పీ శబరీశ్కు బెల్ట్ వినియోగంపై వివరించారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి దేవాదాయశాఖ అధికారులకు సూచించారు.