సీఎం కేసీఆర్ ఆదేశాలతో అధికారులు వైకుంఠధామాల్లో నీటి వసతి కల్పించడంపై దృష్టి సారించారు. జిల్లాలో 323 జీపీలు ఉండగా, 321 గ్రామాల్లో శ్మశాన వాటికల నిర్మాణం పూర్తయింది. కొన్ని కారణాల వల్ల ఒక గ్రామంలో వైకుంఠధామ నిర్మాణం తుది దశలో ఉండగా, మరో గ్రామంలో ప్రారంభ దశలో ఉంది. కాగా, ఇప్పటికే 243 శ్మశాన వాటికల్లో అధికారులు నీటి సౌకర్యం కల్పించారు. ఈ సౌలభ్యం లేని వాటిని గుర్తించి సమాచారం సేకరిస్తున్నారు. జూన్ 3లోగా ఈ ప్రక్రియను పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. జిల్లాలో ఇంకా ఎన్ని వైకుంఠధామాలకు నీటి వసతి కల్పించాల్సి ఉందనే వివరాలు సేకరిస్తున్నామని, ఒకట్రెండు రోజుల్లో సమగ్ర నివేదిక రూపొందిస్తామని ఆర్డబ్ల్యూఎస్ జిల్లా కార్యనిర్వాహక ఇంజినీర్ వెంకటరమణారెడ్డి తెలిపారు.
వరంగల్, మే 19(నమస్తేతెలంగాణ) : జూన్ మూ డో తేదీ నుంచి ప్రారంభం కానున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణపై బుధవారం సీఎం కేసీఆర్ హైదరాబాద్లో ఉన్నతస్థాయి సమీక్ష సమావే శం నిర్వహించారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ని ర్మించిన వైకుంఠధామాలకు విద్యుత్, నీటి వసతి ఉం డాలని, లేని వాటికి పదిరోజుల్లోగా మిషన్ భగీరథ నీ టి సరఫరా వసతి కల్పించాలని సీఎం ఆదేశించారు. దీంతో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రా రంభమయ్యే జూన్ మూడో తేదీలోగా అన్ని శ్మశానవాటికల్లో నీటి వసతి కల్పించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి జిల్లా లో నీటి సౌలత్ లేని వైకుంఠధామాలను గుర్తించే పని లో నిమగ్నమయ్యారు. జిల్లాలో 323 గ్రామ పంచాయతీలు ఉంటే పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 321 జీపీల్లో శ్మశానవాటికలు నిర్మించింది. వీటిలో 157 వైకుంఠధామాలకు విద్యుత్, 243 వైకుంఠధామాలకు నీటి వసతి కల్పించింది. 252 వైకుంఠధామాల్లో టాయ్లెట్స్ నిర్వహిస్తున్నట్లు పంచాయతీ అధికారులు వెల్లడించారు. 254 వైకుంఠధామాల్లో బయోఫెన్సింగ్ వేసినట్లు కూడా తెలిపారు. పదిహేను వైకుంఠధామాల్లో బాడీ ఫ్రీజర్లు అందుబాటులోకి వచ్చినట్లు తాజాగా ప్రభుత్వానికి పంపిన నివేదికలో వెల్లడించారు. ప్రధానంగా సీఎం కేసీఆర్ ఆదేశాలతో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు గురువారం నుంచి క్షేత్రస్థాయిలో వైకుంఠధామాలను పరిశీలిస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులతోనూ చర్చించి వాటిలో నీటి సౌలత్ కల్పించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు.
78 వైకుంఠధామాలకు..
జిల్లాలో ప్రస్తుతం వినియోగంలో ఉన్న వైకుంఠధామాల్లో ఇంకా 78 వైకుంఠధామాలకు నీటి వసతి కల్పించాల్సి ఉందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. 321 వైకుంఠధామాల్లో గ్రామానికి దగ్గరగా ఉన్న వాటికి ఊళ్లో సరఫరా చేస్తున్న మిషన్ భగీరథ నీటి కనెక్షన్ ఇచ్చారు. మెయిన్ పైపులైన్ నుంచి ఇచ్చే అవకాశం లేనందున గ్రామంలోని ఇంట్రా విలేజ్ పైపులైన్ నుంచి సదరు వైకుంఠధామాలకు మిషన్ భగీరథ నీటి సౌలత్ కల్పించారు. గ్రామానికి దూరంగా ఉన్న వైకుంఠధామాల్లో కొన్నింటిలో గ్రామ పంచాయతీ, మండల పరిషత్ నిధులతో బోర్లు వేసి పంపుసెట్లు అమర్చారు. 78 వైకుంఠధామాల్లో నీటి వసతి లేదు. ఇవన్నీ గ్రామానికి దూరంగా ఉన్నవే కావడం గమనార్హం. వీటికి గ్రామం నుంచి పైపులైన్ వేయడం కంటే బోర్లు వేసి పంపుసెట్లు అమర్చి నీటి వసతి కల్పించడమే ఉత్తమమని అధికారులు భావిస్తున్నారు.
బోరు, పంపుసెట్ ఏర్పాటు ఖర్చు కంటే గ్రామం నుంచి పైపులైన్ వ్యయం ఎక్కువవుతున్నదని ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం నెలనెలా గ్రామ పంచాయతీలకు ఇస్తున్న నిధులతో బోరు వేసి విద్యుత్ మోటరు ఏర్పాటు చేయొచ్చని తెలిపారు. నిధులు లేని చిన్న పంచాయతీల్లోని వైకుంఠధామాలకు మండల పరిషత్ నిధులు వెచ్చించాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నందున మిషన్ భగీరథ ఇంజినీర్లు నీటి వసతి లేని వైకుంఠధామాలను గుర్తించి బోరు, పంపుసెట్ ఏర్పాటుకు ఎస్టిమేట్స్ తయారు చేస్తున్నారు. పంచాయతీ, మండల పరిషత్ నిధులతో నీటి వసతి కల్పించే పనుల కోసం ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవడానికి సమాయత్తమవుతున్నారు.