కరీమాబాద్, జూన్ 14: బీఆర్ఎస్ ప్రభుత్వం వైద్య రంగానికి అధిక నిధులు కేటాయిస్తున్నదని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉర్సు బైపాస్రోడ్డులో బుధవారం వైద్య ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని కొనియాడారు. ప్రత్యేకంగా వరంగల్ నగరాన్ని మెడికల్ హబ్గా తీర్చిదిద్దుతున్నారన్నారు. సుమారు రూ. 1250 కోట్లతో దేశం అబ్బురపడేలా సూపర్స్పెషాలిటీ దవాఖానను నిర్మిస్తున్నారని గుర్తుచేశారు. దీంతో పేదలకు మెరుగైన వైద్య సేవలు మరింత చేరువ కానున్నట్లు చెప్పారు. ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు.
గత ప్రభుత్వాలు వైద్య రంగాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నగరంలోని కాలనీల్లో సైతం బస్తీ దవాఖాలు ఏర్పాటు చేయిస్తున్నారన్నారు. బాలింతలు, గర్భిణుల కోసం వాహనాలను ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. ప్రభుత్వ దవాఖానల్లో అధునాతన సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు పెరిగాయన్నారు. దీంతో ఉపాధితోపాటు అభివృద్ధి జరుగుతున్నదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రజలు అండగా ఉండాలని కోరారు. తెలంగాణలో ప్రభుత్వ దవాఖానల పనితీరు.. అందుతున్న వైద్య సేవలను బేరీజు వేసుకోవాలన్నారు. ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.