ఖానాపురం, మే 4: అన్ని దానాల్లోకెల్ల రక్తదానం గొప్పది.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకునేందుకు రక్తం ఎంతో ఉపయోగపడుతుంది. సమాజంలో ఇలాంటి అవసరాలను గుర్తించిన మండలంలోని రాగంపేటకు చెందిన కన్నె రాజు.. వృత్తిరీత్యా కానిస్టేబుల్ అయినా ప్రవృత్తి మాత్రం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మన్ననలు పొందుతున్నాడు. అతడు 2005లో మొదటిసారి రక్తదానం చేశాడు. 18 ఏళ్లలో ఇప్పటి వరకు తాను 31 సార్తు రక్తదానం చేయడమే కాకుండా సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్, ట్విట్టర్లో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, ఢిల్లీ, హర్యానా రాష్ర్టాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 85 వేల మంది యువకులకు రక్తదానంపై అవగాహన కల్పించాడు. ఇప్పటివరకు ఆయన 15,695 యూనిట్ల రక్తదానం చేయించి శభాష్ అనిపించుకుంటున్నాడు. కరోనా సమయంలో అవసరమైన 5409 మందికి రక్తదానం చేయించారు. అదే సమయంలో తలసేమియా బాధితుల కోసం 42 రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయించి, 1386 యూనిట్ల రక్తాన్ని సేకరించి, ఇండియన్ రెడ్క్రాస్ సెంటర్కు అప్పగించాడు. లాక్డౌన్ సమయంలో రక్తదానంతోపాటు 209 రోజులపాటు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించాడు. ఆపదలో ఉన్న వారికి బియ్యం పంపిణీతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత అందిస్తున్నాడు. 13 ఏళ్లుగా మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇంగ్లిష్ డిక్షనరీలు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి స్టడీ మెటీరియల్, టెన్త్ విద్యార్థులకు పరీక్షల సమయంలో సామగ్రి అందజేస్తున్నాడు. ఎస్సెస్సీలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేస్తూ ప్రోత్సహిస్తున్నాడు. అలాగే, హరితహారం, స్వచ్ఛభారత్, మూఢ నమ్మకాలు, హెల్మెట్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాగింగ్, ఎయిడ్స్ నిర్మూలనకు తనవంతుగా కృషి చేస్తున్నాడు.
85కు పైగా అవార్డులు సొంతం
కానిస్టేబుల్ రాజు సేవలకు గుర్తింపుగా ఇప్పటి వరకు 85కు పైగా అవార్డులు సొంతం చేసుకున్నాడు. 2023లో హర్యానా సీఎం మనోహర్లాల్ చేతులమీదుగా రక్తదాన అవార్డును అందుకున్నాడు. 2022లో జాతీయ సేవారత్న, పద్మసేవ అవార్డులు పొండారు. 2022లో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మార్చి 23న 1476 రక్తదాన క్యాంపులు నిర్వహించి, 1,27,675 మందితో రిజిస్ట్రేషన్ చేయించి, 97,744 మందితో రక్తదానం చేయించి ఇంటర్నేషనల్ లైఫ్ సేవర్ అవార్డును అప్పటి వరంగల్ కలెక్టర్ గోపి చేతులమీదుగా అందుకున్నాడు. అలాగే, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు చేతులమీదుగా అవార్డు పొందాడు. కరోనా సమయంలో రక్తదానం, ప్లాస్మాదానం, అన్నదానం చేసినందుకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి చేతులమీదుగా ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా బెస్ట్ ఎన్జీవో అవార్డు అందుకున్నాడు. 2018లో బెస్ట్ బ్లడ్ డోనర్ అవార్డు, 2019లో సామాజిక సేవా రంగంలో జాతీయస్థాయి ఉగాది పురస్కారం, తెలంగాణ రాష్ట్రస్థాయి ఐడియల్ పోలీస్ అవార్డు, జాతీయస్థాయి తెలంగాణ కళారత్న అవార్డు.. ఇలా 2013 నుంచి 85కు పైగా అవార్డులు పొందాడు.
అవయవ దానంపై అవగాహన కల్పిస్తా
రక్తదానంపై ప్రజలకు అవగాహన పెరిగింది. ఎక్కడ రక్తదాన శిబిరం నిర్వహించినా అనేక మంది యువకులు వచ్చి రక్తదానం చేస్తున్నారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో అవయవ దానంపై అవగాహన కార్యక్రమాలు చేపడతా. నేడు ఎంతోమంది కిడ్నీ, కాలేయం, కళ్ల సమస్యలతో బాధపడుతున్నారు. అవయవదానం చేస్తే వారందరినీ మనం రక్షించుకోవచ్చు. సామాజిక సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. అప్పుడే మెరుగైన సమాజాన్ని నిర్మించుకోలుగుతాం.
– కన్నె రాజు, కానిస్టేబుల్