వరంగల్, మార్చి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిని తేల్చడం కాంగ్రెస్కు కత్తిమీద సాములా మారింది. ఇక్కడ ఏకంగా ఏడుగురు పోటీ పడుతుండడం ఆ పార్టీకి తలబొప్పికట్టిస్తోంది. అభ్యర్థి ప్రకటన ఆలస్యమైన కొద్దీ ఆశావహులు పెరుగుతుండగా ఎవరికివారే ఏఐసీసీ స్థాయిలో మంతనాలు జరుపుతుండడం కార్యకర్తలను అయోమయంలో పడేస్తున్నది. “టికెట్ నాకంటే.. నాకు’ అనే ధీమా పోటీదారులందరిలోనూ కనిపిస్తుండగా, ఆ పార్టీ గురువారం విడుదల చేసిన రెండో జాబితాలోనూ వరంగల్ పేరు లేకపోవడం మరింత ఉత్కంఠ రేపుతున్నది.
కాంగ్రెస్లో వరంగల్ లోక్సభ టికెట్ పంచాయితీ తెగడంలేదు. ఎన్నికలు సమీపిస్తున్నా ఆ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు. ఆలస్యమవుతున్న కొద్దీ పార్టీలో పంచాయితీలు పెరుగుతున్నాయి. అధికార పార్టీ కాబట్టి అనుకూలత ఉంటుందనే ఉద్దేశంతో ఎక్కువ మంది నేతలు టికెట్ ఆశిస్తున్నారు. అధిష్టానం వద్ద ఎవరికి వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కాగా కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన ఇప్పట్లో ఉండబోదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ సమయం దగ్గర పడ్డప్పుడే ప్రకటిస్తారని అంటున్నారు. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 18న రానుండగా వరంగల్ స్థానంపై ఇప్పటికే ఏడుగురు నేతలు ధీమాతో ఉన్నారు. టిక్కెట్ కచ్చితంగా తనకే వస్తుందని ఎవరికివారు భావిస్తున్నారు. కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నవారిలో సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్, శనిగపురం ఇందిర, దొమ్మాటి సాంబయ్య, రామగల్ల పరమేశ్వర్, బక్క జడ్సన్, జన్ను పరంజ్యోతి, నమిండ్ల శ్రీనివాస్ ఉన్నా రు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ మంత్రి అండదండలతో ఎవరికి వారు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో ఇతర నేతలకు రాకుండా చేస్తున్నారు. ఈ పరిణామాలతో నాయకులు, కార్యకర్తలు ఆయోమయానికి లోనవుతున్నారు.
కాంగ్రెస్ తరఫున 2019 ఎన్నికల్లో పోటీ చేసిన దొమ్మాటి సాంబయ్య టికెట్పై ధీమాతో ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. సాంబయ్య గత ఎన్నికల్లో పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో సాంబయ్యకు 2,62,200 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్కు ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు పోటీ చేసిన తనకు ఇప్పుడు అవకాశం వస్తుందని భరోసాతో ఉన్నారు.
స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శనిగపురం ఇందిర వరంగల్ ఎంపీ సీటు కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. లోక్సభ సీట్లలో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్, బీజేపీ రెండు స్థానాలను మహిళలకు ఇచ్చాయని, కాంగ్రెస్ సైతం ఇదే తరహాలో తనకు అవకాశం ఇస్తుందని ఇందిర ఆశాభావంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్నం సునీతామహేందర్రెడ్డి పేరును మల్కాజ్గిరి, చేవెళ్ల సీట్లలో ఒకదానికి అభ్యర్థిగా పరిశీలిస్తున్నది. మరో సీటును మహిళకు కేటాయించే అవకాశం ఉన్నదని ఇందిర ధీమాతో ఉన్నారు.
వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ ఇటీవలే కాంగ్రెస్లో చేరారు. టికెట్ హామీతోనే ఆయన హస్తం పార్టీలో చేరినట్లు పసునూరి సన్నిహితులు చెబుతున్నారు. ఆయన బీఆర్ఎస్ తరఫున రెండుసార్లు గెలిచారు. 2015 ఉప ఎన్నికలో 4,59,233 ఓట్ల రికార్డు మెజారిటీతో విజయం సాధించారు. 2019 సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా 3,50,298 ఓట్ల మెజారిటీతో గెలిచారు. వరుసగా రెండుసార్లు గెలిచిన నేపథ్యం ఉండడం, సిట్టింగ్ ఎంపీగా అధికార పార్టీలో చేరడంతో ఈసారి తనకు అవకాశం వస్తుందని దయాకర్ ఆశాభావంతో ఉన్నారు.
వరంగల్ లోక్సభ కాంగ్రెస్ టికెట్ను రామగళ్ల పరమేశ్వర్ సైతం ఈ సారి ఆశిస్తున్నారు. 2009లో బీఆర్ఎస్ తరఫున, 2014లో బీజేపీ తరఫున పోటీ చేసిన ఆయన, రెండు ఎన్నికల సానుభూతితో కాంగ్రెస్ పార్టీ ఈసారి తనకు అవకాశం ఇస్తుందని భావిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బక్క జడ్సన్ తన విధేయతను కాంగ్రెస్ అధిష్టానం గుర్తిస్తుందని, ఈసారి తనకే టిక్కెట్ వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. వర్ధన్నపేట అసెంబ్లీ టికెట్ను వదులుకున్న తనకు వరంగల్ లోక్సభ టికెట్ వస్తుందని నమిండ్ల శ్రీనివాస్ ధీమాతో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ద్వారా టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరిన జన్ను పరంజ్యోతి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ మంత్రి అండదండలతో కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.