కరీమాబాద్, మార్చి 18: అందరూ కలిసికట్టుగా పని చేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల హాజరు శాతం పెంచాలని కమ్యూనిటీ మానిటరింగ్ అధికారి సుభాష్ సూచించారు. శంభునిపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు శారదాబాయి ఆధ్వర్యంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ తల్లిదండ్రులు టీచర్లకు సహకరించాలని కోరారు. తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. పిల్లలు పాఠశాలకు రోజూ వచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. సర్కారు పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం సకల వసతులు కల్పిస్తున్నదని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలన్నారు. ఇక్కడ చదివే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
చెన్నారావుపేట/రాయపర్తి: పాఠశాలల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అకాడమిక్ మానిటరింగ్ అధికారి మాలోత్ సారయ్య అన్నారు. చెన్నారావుపేట మండలంలోని ఉప్పరపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సారయ్య టెలీకాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థుల హాజరు, పాఠశాల అభివృద్ధి, మధ్యాహ్న భోజనం అమలు, విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధులను చేయడం, మన ఊరు-మన బడి పనుల పురోగతిపై చర్చించారు. విద్యార్థులు పాఠశాలకు విధిగా హాజరయ్యేలా చూడాలని, పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ఫ్లోరెన్స్, ఉపాధ్యాయులు ఉమారిణి, రమణారావు, శ్రీనివాస్, సంతోష్, బాలాజీరావు, మాధవి, రవీందర్ పాల్గొన్నారు. అలాగే, రాయపర్తి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు-తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించారు. విద్యార్థుల ప్రతిభా పాటవాలను తల్లిదండ్రులకు వివరించారు. అనంతరం మధ్యాహ్న భోజనం తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ కోరారు. సమావేశాల్లో హెచ్ఎంలు అజ్మీరా ఉమాదేవి, గారె కృష్ణమూర్తి, చెడుపాక కృష్ణమూర్తి, ఉపాధ్యాయులు రావుల భాస్కర్రావు, మారం రోజారాణి, గుగులోత్ సునీత, ఎస్ఎంసీ చైర్మన్లు పాల్గొన్నారు.
పోచమ్మమైదాన్/నెక్కొండ: పిల్లలపై ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఇన్చార్జి హెచ్ఎం లక్ష్మి కోరారు. ఎల్బీనగర్లోని ప్రభుత్వ చార్బౌళి ఉన్నత పాఠశాలలో పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏప్రిల్లో అన్ని తరగతులకు వార్షిక పరీక్షలు జరుగనున్నాయని, పిల్లలు సమయాన్ని వృథా చేయకుండా చదువుకునేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. ఉపాధ్యాయులు నవీన్కుమార్, నీరజ, ఇఫ్తకార్ అలీ, రమేశ్ పాల్గొన్నారు. అంతేకాకుండా నెక్కొండలోని ప్రాథమిక పాఠశాలలో శనివారం పేరెంట్స్ కమిటీ సమావేశం జరిగింది. పిల్లల విద్యాభివృద్ధికి తల్లిదండ్రులు సహకరించాలని హెచ్ఎం కోరారు. పిల్లలందరికీ గుణాత్మక విద్య అందించేందుకు తల్లిదండ్రులు విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు టీచర్ల సమక్షంలో, ఇంటి వద్ద సమీక్షించుకోవాని హెచ్ఎం కోరారు. ఉపాధ్యాయులు కూడా పిల్లల ప్రగతిని ఎప్పటికప్పుడు గుర్తించాలని సూచించారు. సమావేశంలో ఉపాధ్యాయులు ఐలయ్య, గంగాధర్, రాజేందర్ పాల్గొన్నారు.