డోర్నకల్, జూన్ 7 : పెరుగుతున్న ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల రేట్లు రోజురోజుకూ పెరుగుతుండడంతో సామాన్యులు సతమతమవుతున్నారు. దీనికి తోడు పెట్రోల్, డీజిల్తో పాటు వంట గ్యాస్ ధరలూ పెరగడంతో కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితులు వచ్చాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నదని వాపోతున్నారు. గత మార్చిలో వంట గ్యాస్ సిలిండర్పై రూ. 60 పెంచిన కేంద్రం తాజాగా మరో రూ. 29 పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఇలా ఇంధన ధరలు పెంచుతూ పోతే తాము ఎలా బతకాలంటూ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. రూ. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు సబ్సిడీని ఖాతాల్లో జమచేయడం లేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోసపూరిత హామీలతో తమను బురిడీ కొట్టించిందని ప్రజలు కాంగ్రెస్ను విమర్శిస్తున్నారు. కేంద్రం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాట కూడా మాట్లాడడం లేదని, ప్రజలకు ఆర్థిక భారం తగ్గించే చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. కేవలం నెల రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలను మూడుసార్లు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.116.26, డీజిల్ రూ. 104.34కు చేరుకుందని, వంట గ్యాస్ రేట్ను మరో రూ. 29 పెంచడంతో అది రూ. 984 నుంచి రూ. 1,013కు చేరుకుందని అంటున్నారు. దీనికి డెలివరీ సిబ్బంది అదనంగా వసూలు చేస్తారన్నారు. అలాగే వాణిజ్య సిలిండర్ ధరను ఈ నెల 1న రూ. 361కి పెంచడంతో అది రూ. 3371కు చేరుకుంది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లలో టిఫిన్లు, భోజనాల రేట్లను పెంచారు. ఇంధన ధరల పెంపుతో రవాణా ఖర్చులు ఎక్కువై నిత్యావసరాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక భారాన్ని తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు.
వంట గ్యాస్ ధర పెరగడంతో ఆర్థిక భారం పెరిగింది. గ్యాస్ డీలర్లు 45 రోజులకు ఒక సిలిండర్ ఇస్తున్నరు. గ్యాస్ బుక్ చేస్తే అసలు రేట్కు అదనంగా మరో రూ.50 తీసుకుంటున్నరు. బ్లాక్లో అధిక ధరకు అమ్ముతున్నరు. రూ.500కే సిలిండర్ ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం సబ్సిడీని ఇంత వరకు ఇవ్వడం లేదు. గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి.
– మంజుల భాగ్యలక్ష్మి, గృహణి, డోర్నకల్సబ్ రిజిస్ట్రార్లకొత్త తరహాదందా