వరంగల్,మే 25 : గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సరఫరా సమర్థవంతంగా నిర్వహించాలని కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. గురువారం ధర్మసాగర్, వడ్డేపల్లి, కేయూ ఫిల్టర్ బెడ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ధర్మసాగర్ 60 ఎంఎల్డీ ఫిల్టర్ బెడ్ను పరిశీలించి అక్కడి నుంచి ఏఏ ప్రాంతాలకు తాగునీరు సరఫరా అవుతున్నదని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నగరానికి ఎన్ని రిజర్వాయర్ల ద్వారా తాగునీటి సరఫరా జరుగుతున్నదని అడిగారు.
అనంతరం ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. తాగునీటి సరఫరాపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, సమస్యలు ఉంటే వెంటవెంటనే పరిష్కరించాలని సూచించారు. అలాగే కాకతీయ యూనివర్సిటీ ఫిల్టర్ బెడ్ ప్రాంగణంలోని మెటీరియల్ రికవరీ సెంటర్ను తనిఖీ చేశారు. గ్రేటర్లోని 23 డీఆర్సీ సెంటర్ల ద్వారా వచ్చే పొడి వ్యర్థాలు మెటీరియల్ రికవరీ సెంటర్కు వస్తుంటాయని అధికారులు తెలిపారు. ఆయన వెంట బల్దియా ఈఈ ప్రవీణ్ చంద్ర, సీఎంహెచ్వో డాక్టర్ రాజేశ్, ఈఈలు శ్రీనివాస్రావు, రాజయ్య, శ్రీనివాస్, మిషన్ భగీరథ గ్రిడ్ అధికారి రామాంజనేయులు, పబ్లిక్ హెల్త్ ఈఈ రాజ్కుమార్, డీఈలు రవికుమార్, సంతోష్బాబు ఉన్నారు.
టీఎస్ బీపాస్ నిబంధనల మేరకే అనుమతులు..
వరంగల్ : టీఎస్ బీపాస్ నిబంధనల మేరకు భవన నిర్మాణ అనుమతులను మంజూరు చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో భవన నిర్మాణాల స్థలాలను పరిశీలించారు. చైతన్యపురి, కాజీపేట దర్గా ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కమిషనర్ వెంట టీపీఎస్ బషీర్, సుష్మ ఉన్నారు.
ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా..
వరంగల్ : నగరంలోని ప్రతి ఇంటికీ తాగునీటి సరఫరా జరుగాలని కమిషనర్ సూచించారు. కాజీపేట సర్కిల్ కార్యాలయంలో ఇంజినీరింగ్ అధికారులతో తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు నెలల్లో తాగునీటి సరఫరా మెరుగుపడాలన్నారు. ఇంజినీర్లు, వర్క్ ఇన్స్పెక్టరు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ప్రతి రోజూ నగర శివారు ప్రాంతంలోని 25 మంది వినియోగదారుల వివరాలను కాల్ సెంటర్లో అప్డేట్ చేయాలని ఆదేశించారు. రోజూ వారి నీటి సరఫరా తనిఖీ వివరాలను యాప్, గూగుల్ షీట్లో అప్లోడ్ చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న పైన్లైన్లు, అమృత్ పథకం కింద వేసిన పైన్లైన్ల ప్లాన్లను సమర్పించాలని సూచించారు. బైపాస్లలో ఫ్లో సరఫరాను తనిఖీ చేయడానికి మొబైల్ ఫ్లో మీటర్లను కోనుగోలు చేసేందుకు అంచనాలను సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, స్పెషల్ కన్సల్టెంట్ రవికుమార్ పాల్గొన్నారు.