వరంగల్, అక్టోబర్ 13: గ్రేటర్ వరంగల్ పరిధిలో వాణిజ్య ఉపయోగ భవనాల గుర్తింపు సర్వే పక్కాగా జరుగాలని కమిషనర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ కౌన్సిల్ సర్వే బృందాలతో గురువారం ఆమె సమీక్షించారు. కమర్షియల్గా వినియోగిస్తున్న భవనాల గుర్తింపు సర్వేపై ఆమె బృందాలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్రావీణ్య మాట్లాడుతూ నగరంలో రెసిడెన్షియల్ అనుమతులు తీసుకొని కమర్షియల్కు వినియోగిస్తున్న భవనాల గుర్తింపు ద్వారా కార్పొరేషన్కు ఆదాయం వస్తుందన్నారు. దీంతోపాటు రెసిడెన్షియల్, కమర్షియల్ భవనాల రికార్డుల నిర్వహణ సులభతరం అవుతుందన్నారు. కమర్షియల్గా వినియోగించే రెసిడెన్సియల్ గృహలను గుర్తించి క్రమబద్ధీకరించాలన్నారు.
పైలట్ ప్రాజెక్టుగా సర్వే
కమర్షియల్ వినియోగ భవనాల గుర్తింపు సర్వేను వరంగల్, హనుమకొండ జిల్లాలోని రెండేసి ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్గా చేపట్టాలని కమిషనర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. హనుమకొండలోని కాళోజీ జంక్షన్ నుంచి పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వరకు ఒక స్ట్రెచెస్, పోలీస్ కమిషనరేట్ నుంచి ములుగురోడ్ జంక్షన్ వరకు చేయాలని ఆమె సూచించారు. వరంగల్ ప్రాంతంలోని ములుగురోడ్ జంక్షన్ నుంచి పోచమ్మమైదాన్, పోచమ్మమైదాన్ నుంచి వెంకట్రామ జంక్షన్ వరకు రోడ్డుకు ఇరువైపులా నివాస, వాణిజ్య భవనాల వివరాలను సర్వే చేసి నిర్దేశించిన నమూనాలో నివేదిక అందజేయాలని ఆదేశించారు. పైలట్ ప్రాజెక్ట్లుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో గ్రేటర్ కార్పొరేషన్ డేటా ప్రకారం సర్వే చేయాలన్నారు. దీంతోపాటు అనధికార పెంట్ హౌస్లు, సెల్లార్లలో అదనపు నిర్మాణాలు, డివియేషన్లను గుర్తించాలన్నారు. కమర్షియల్గా వినియోగిస్తున్న భవనాల ట్రెడ్ లైసెన్స్ ఉంటే భవనాల విస్తీర్ణం కొలతను తీసుకొని తాజా భవన్ యాప్లో జియో ట్యాగింగ్ చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కమిషనర్ అనీసుర్ రషీద్, డిప్యూటీ కమిషనర్లు శ్రీనివాస్రెడ్డి, జోనా, డీసీపీ ప్రకాశ్రెడ్డి, ఐటీ మేనేజర్ రమేశ్, ఏసీపీ, టౌన్ప్లానింగ్ సూపర్వైజర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
పనులను వేగంతంగా పూర్తి చేయాలి
న్యూశాయంపేట: భద్రకాళి బండ్ అభివృద్ధి పనులను వేగంతంగా పూర్తి చేయాలని కమిషనర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. భద్రకాళీ బండ్పై కొనసాగుతున్న అభివృద్ధి పనులను గురువారం ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఆమె వెంట బల్దియా ఎస్ఈ నవీన్చంద్ర, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాసరావు, డీఈలు రవికుమార్, సంతోష్బాబు, డీసీపీ ప్రకాశ్రెడ్డి, ఏజెన్సీ ప్రతినిధులు ఉన్నారు.