హనుమకొండ, డిసెంబర్ 12 : నోబెల్ అవార్డు గ్రహీత కైలాశ్ సత్యార్థి జిల్లా పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వరంగల్ కలెక్టర్ డాక్టర్ గోపి, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజు యాదవ్, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్యతో కలసి ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు మాట్లాడుతూ ఈ నెల 18,19, 20 తేదీల్లో కైలాష్ సత్యార్థి హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిపారు.
18న ఆదాలత్ కోర్టును సందర్శించి, 19న సుబేదారిలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో 50వేల మంది విద్యార్థులతో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. సభకు హనుమకొండ, వరంగల్ జిల్లాల నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 8,9,10 తరగతుల విద్యార్థులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 14న పాఠశాల స్థాయిలో, 15న మండల స్థాయిలో, 17న జిల్లా స్థాయిలో మూడు రోజుల పాటు వృక్తృత్వ, వ్యాసరచన, చిత్ర లేఖనం పోటీలు నిర్వహించాలన్నారు.
ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో సభకు అనుగుణంగా వేదిక, బారికేడ్లు ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. బందోబస్తు ఏర్పాట్లు చూడాలని పోలీస్ శాఖకు సూచించారు. మైదానం అంత శుభ్రంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ట్రాన్స్కో అధికారులకు సూచించారు. అన్ని శాఖల అధికారులు తమకు అప్పగించిన పనులను పూర్తి చేసి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. విద్యార్థులతో దేశభక్తిని పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించాలని సూచించారు.
గిర్మాజీపేట : నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి పర్యటన భాగంగా ఈ నెల 19న హనుమకొండ ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించనున్న భారీ సభకు వరంగల్ జిల్లా నుండి 25 వేల మంది విద్యార్థులు హాజరయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డీఈవో వాసంతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సభకు వరంగల్, ఖిలావరంగల్ మండలాల నుంచి ప్రభుత్వ, ప్రైవేట్, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలలు, మైనార్టీ, జ్యోతిబాఫూలే, గిరిజన, బీసీ వెల్ఫేర్ పాఠశాలల్లో చదువుతున్న 8,9,10వ తరగతి విద్యార్థులు హాజరుకావాలని కోరారు.
కార్యక్రమంలో భాగంగా 6 నుండి 10వ తరగతి చదువుతున్న అన్ని యాజమాన్యాల పాఠశాల విద్యార్థులకు ‘నవ తెలంగాణలో పిల్లల భాగస్వామ్యం’ అంశంపై వకృత్వ పోటీలు, ‘బంగారు బాల్యానికి అవరోధాలు- నివారణచర్యలు’ అనే అంశంపై వ్యాసరచన పోటీలు, ‘పిల్లల స్నేహపూర్వక తెలంగాణ’ చిత్రలేఖనం పోటీలను పాఠశాల స్థాయిలో 14 వరకు, మండల స్థాయిలో 15న, జిల్లా స్థాయిలో 17న నిర్వహించాలని పేర్కొన్నారు. అన్ని మండల విద్యాధికారులు, నోడల్ ఆఫీసర్లు సమన్వయంతోఅన్ని పాఠశాలల నుండి విద్యార్థులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని డీఈవో వాసంతి కోరారు.