హనుమకొండ, జూన్ 27: రహదారుల భద్రతా చర్యల్లో భాగంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ఆర్ అండ్ బి, పోలీస్, జాతీయ రహదారులు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రోడ్డు భద్రతపై రోడ్లు, భవనాలు, పోలీస్, జాతీయ రహదారులు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల్లో రద్దీ ప్రాంతాలు, ప్రమాదకర ప్రాంతాలు, క్రిటికల్ జంక్షన్లను గుర్తించి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కటాక్షపూర్ వద్ద నిర్మాణంలో భాగంగా జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు రేడియంతో కూడిన సైన్ బోర్డులు, బ్లీంకర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. తరచుగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి ఆ జాబితాను అందజేయాలని అన్నారు. ప్రమాదాల నివారణకు మూతలు లేని, నిర్మాణ పనులు జరుగుతున్న చోట్ల, మ్యాన్ హోల్స్ వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అధికారులు సూచించిన అంశాలపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఆర్ అండ్ బీ ఈఈ సురేష్ బాబు, నేషనల్ హైవేస్ ఈఈ మనోహర్, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ నారాయణ, అడిషనల్ డీసీపీ ప్రభాకర్ రావు, ఏసీపీలు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.