హనుమకొండ, డిసెంబర్ 6 : జిల్లాలో తొలిమెట్టు ఉన్నతి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. బుధవారం హనుమకొండ లష్కర్బజార్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖాధికారి అబ్దుల్ హై అధ్యక్షతన తొలిమెట్టు ఉన్నతి కార్యక్రమాల లక్ష్యం, అమలుపై జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించేందుకు రూపొందించిన ఎఫ్ఎల్ఎన్, ఉన్నతి కార్యక్రమాల అమలు పర్యవేక్షణను ఎలా నిర్వహించాలి అనే అంశంపై సీపీడీ సెల్ వరంగల్ డైట్ ఎస్ఆర్జీ గ్రూప్ వారు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి ఎస్సెస్సీ ఫలితాల్లో జిల్లాను ముందంజలో ఉంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విద్యార్థుల్లో పఠనా సామర్థ్యం పెంపొందించాలని ఆర్జేడీ సత్యనారాయణ రెడ్డి అన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని డీఈవో సూచించారు. క్వాలిటీ కో ఆర్డినేటర్ ఏ శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుపై మక్కువ పెరిగేలా పాఠాలు చెప్పాలన్నారు. కార్యక్రమంలో డైట్ వరంగల్ సీపీడీ సెల్ ఎస్ఆర్జీలు మధుసూదన్రెడ్డి, కే సంపత్ కుమార్, వీ శ్యాంసుందర్ పాల్గొన్నారు.